దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఒకటి.. రెండుతో మొదలై పదులు వందలు దాటి లక్షలకు చేరింది. నెలలు గడుస్తున్న కొద్దీ రెట్టింపు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే సుమారుగా 20 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నెల వ్యవధిలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదు కాలేదు.
దేశంలో జనవరి 30న ఫస్ట్ కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి కరోనాను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నివిధాలా ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో మార్చి నుంచి లాక్డౌన్ షురూ చేసింది. లాక్డౌన్తో వ్యాపార, వాణిజ్య, రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జన సంచారం కూడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కరోనా అదుపులోకి వస్తుందని అందరూ ఆశించగా.. ఆ స్థాయిలో కాకున్నా కొద్దోగొప్పో కంట్రోల్లోనే ఉండింది.
గత మూడు నెలలుగా దేశంలో అన్లాక్ ప్రక్రియ నడుస్తోంది. ఈనెలతో అన్లాక్ 4.0 అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే అన్లాక్ ప్రక్రియ మొదలైందో జనం రోడ్లపైకి వచ్చుడు స్టార్ట్ చేశారు. మార్కెట్లు, షాపులు ఎక్కడా చూసినా జనసంచారమే కనిపించింది. దీంతో ఒక్కో రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి.. రాష్ట్రాల నుంచి జిల్లాలకు.. జిల్లాల నుంచి మండలాలకు.. మండలాల నుంచి గ్రామాలకు వైరస్ పాకింది. ఉద్యోగులు, కూలీలు ఏ రంగానికి చెందిన వారైనా తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు వైరస్ను అదుపు చేయడం ఎవరి తరమూ కావడం లేదు.
భారత్లో నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారానికి దేశవ్యాప్తంగా 36 లక్షల 91 వేల సంఖ్య నమోదైంది. ఇందులో ఇప్పటికే 28.39 లక్షల మంది కోలుకోగా.. మరో 7.85 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 65,288కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 76 శాతం కనిపిస్తోంది.