CM Revanth Reddy: రేవంత్‌కు ‘నామినేటెడ్‌’ పరీక్ష.. ఎవరు అర్హులంటే?

పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ నాయకులు నామినేటెడ్‌ పదవుల కోసం కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆలస్యం చేయకుండా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Written By: Raj Shekar, Updated On : January 2, 2024 1:02 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టింది. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మహిళలకు రూ.2,500 సాయం, రైతుభరోసా పెంపు, పింఛన్ల పెంపు, రూ.500 సిలిండర్, 200 ఉచిత విద్యుత్‌ అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేషన్‌ కార్డుల జారీకి కూడా చర్యలు చేపడుతోంది. మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రభుత్వం ఎండగడుతోంది. విద్యుత్, ఆర్థిక రంగాలపై ఇప్పటికే స్వేత పత్రాలు విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇలా విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. హామీలు నెరవేర్చే దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది.

తొలి పరీక్షకు రెడీ..
పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ నాయకులు నామినేటెడ్‌ పదవుల కోసం కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆలస్యం చేయకుండా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో ఆ పోస్టులకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. నామినేటెడ్‌ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే సీఎం రేవంత్‌ మాత్రం పైరవీలు పని చేయవని చెబుతున్నారు. పార్టీ కోసం ఎవరు పని చేశారో తన దగ్గర లెక్క ఉందని.. పని చేసిన వారికి పదవులు వస్తాయని అంటున్నారు. దీంతో రేవంత్‌కు నామినేటడ్‌ పరీక్ష ఎదురు కానుంది.

వంద మంది ఆశావహులు..
కాంగ్రెస్‌లో దాదాపు వంద మందికిపైగా నేతలు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 3న కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పదవుల ప్రకటన ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. పార్టీ ముఖ్యమైన నేతలు అంతా కూడా నామినేటెడ్‌ పోస్టులపై ఫోకస్‌ పెట్టారు. సంక్రాంతి లోపే చాలామందికి తీపికబురు అందుతుందని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయిలో పవర్‌ ఉన్న నామినేటెడ్‌ పోస్టులు 30 వరకు ఉంటాయి. వాటి కోసం ఎక్కువ డిమాండ్‌ వినిపిస్తోంది. యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, రైతు విభాగం.. ఇలా ఏ విభాగానికీ టిక్కెట్లు దక్కలేదు. వారికి నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారి కన్నా.. పదేళ్లుగా కాంగ్రెస్‌లో పని చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.