దేశంలో పార్టీ అధికారం కోల్పోయి ఏడేళ్లు కావస్తున్నా పార్టీ తీరులో ఏ మార్పు కానరావడం లేదు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సంస్థాగత పదవులన్నీ కొందరికే కేటాయిస్తున్నారని అపవాదు మూటగట్టుకుంటోంది. ఒకే ప్రాంతానికి చెందిన వారికే పదవులు ఇస్తున్నారని అందరిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. దీంతో తమ అసమ్మతి వాణిని అధిష్టానానికి వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభలో పార్టీ విప్ గా కర్ణాటకకు చెందిన నసీర్ హుస్సేన్ ను నియమించడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అక్కడి నుంచి సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన గుల్బార్గా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా కర్ణాటకకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని నేతల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే పార్టీకి చెందిన నేత జైరాం రమేష్ కూడా ఉప నేతగా వ్యవహరిస్తుండడంతో నేతల్లో అసహనం పెరిగిపోతోంది.
2019 ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో పార్టీ మంచి ఫలితాలు సాధించినందున పదవులన్ని దక్షిణాదికే ఇష్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలను కూడా పట్టించుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. సంస్థాగత పదవులన్ని దక్షిణాదికే కేటాయిస్తే ఇక మాకు ఎప్పుడు పదవులు ఇస్తారని పలువురు అడుగుతున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే అన్ని ప్రాంతాలను కలుపుకుని పోయేలా ఉండాలని సూచిస్తున్నారు. ఏదో ఒక ప్రాంతానికి చెందన వారినే అక్కున చేర్చుకుంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.