CM KCR: వైష్ణవం నుంచి.. శైవం వైపు.. కేసీఆర్‌ ఆధ్యాత్మిక ప్లాన్ ఏంటి?

CM KCR: యాదాద్రి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇన్నేళ్లు వైష్ణవానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌ ఇక నుంచి శైవం వైపు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శైవానికి ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న […]

Written By: NARESH, Updated On : April 5, 2022 6:48 pm
Follow us on

CM KCR: యాదాద్రి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇన్నేళ్లు వైష్ణవానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌ ఇక నుంచి శైవం వైపు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శైవానికి ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అపవాదును తొలగించుకోవడానికే కేసీఆర్‌ శైవాలయాలపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన రోజే దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయాలనే తన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ సన్నిహితులకు తెలియజేయడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.

CM KCR

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో.. వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టును కూడా మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టుగా సమాచారం. వేములవాడ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం త్వరలోనే కేసీఆర్‌ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వద్దకు వెళుతున్నారనే ప్రచారం సాగుతుంది. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే అప్పగిస్తారనీ, పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే వస్తారనీ కూడా విశ్వసనీయ వర్గాలు సమాచారం.

Also Read: Heatwaves: ఎండ‌ల తీవ్ర‌త‌పై ఐఎండీ హెచ్చ‌రిక.. ఈ రెండు వారాలు బ‌య‌ట‌కు రాకండి..

-వేములవాడ పునర్నిర్మాణ బాధ్యతలు సీఎల్‌ రాజంకు..!
వేములవాడ పునర్నిర్మాణ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్‌ రాజంకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎల్‌ రాజం కేసీఆర్‌కు సన్నిహితునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీగా కొనసాగారు. సీఎం రాజంను కేసీఆర్‌ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. రాజం బీజేపీలో చేరారు. దీంతో కేసీఆర్‌కు, రాజంకు మధ్య దూరంగా పెరిగిందనే వార్తలు వచ్చాయి. సీఎల్‌ రాజం మరో పత్రికను నడుపుతున్నారు.

-యాదాద్రిలో కేసీఆర్‌తో సీఎల్‌ రాజం…
అయితే తాజాగా యాదాద్రి పున:ప్రారంభం సందర్భంగా సీఎల్‌ రాజం కేసీఆర్‌తోపాటు కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య దూరం తగ్గిందనే ప్రచారం మొదలైంది. ఇక, వేములవాడ ఆలయం పునర్నిర్మాణ బాధ్యతను సీఎం రాజంకు అప్పగించడమే సముచితమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

-2015లో రాజన్న దర్శనం..
2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఏడాదికి వేములవాడ అభివృద్ధికి హామీ ఇచ్చారు. 2015 జూన్‌ 18న కుటుంబంతో సహా వేములవాడ ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్‌.. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్దికి ఏటా రూ.వంద కోట్లు చొప్పున నాలుగేళ్లలో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గుడిచెరువు చుట్టూ150 ఫీట్ల వెడల్పుతో 3.5 కి.మీ. మేర ట్యాంక్‌ బండ్‌ నిర్మిస్తామని ప్రకటించారు. కంచి కామకోటి పీఠాల సూచనలను స్వీకరిస్తానని చెప్పారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరిలో వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(వీటీడీఏ)ని ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో దాదాపు రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన 13 అంశాలతో కూడిన పనుల ప్రతిపాదనలను రూపొందించారు. వీటికి అదనంగా సాగునీటి పారుదల శాఖ తరఫున మిష¯Œ కాకతీయ పథకం ద్వారా రూ.63 కోట్లతో గుడి చెరువు ట్యాంక్‌బండ్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తర్వాత ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.90.34 కోట్లకు పెంచారు. అయితే.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల డిజైన్లు పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇదిలా ఉంటే 2022–23 వార్షిక బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించారు.

-వేములవాడలో ఆనంద్‌సాయి పర్యటన..
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన స్తపతి, ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌సాయి సోమవారం వేములవాడకు వచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయన ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఈవోతో కలిసి మార్పులు చేర్పులు, పునర్నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. గర్భాలయానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా పరిసరాలను ఆగమశాస్త్రం ప్రకారం అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ చేయబోతున్నారు. ఈమేరకు ఆలయం మొత్తాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు. రాజన్న ఆలయంతోపాటు, ఉప ఆలయాలు బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయాలను కూడా ఆయన పరిశీలించారు. కాకతీయుల కళావైభవం ఆలయ అభివృద్ధిలో ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది. నూతన ప్రాకారాల నిర్మాణం, మండపాల నిర్మాణం, గాలిగోపుర నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు ఆనంద్‌సాయి తెలిపారు.

Vemulawada

-37 ఎకరాల్లో ఆలయ విస్తరణకు ప్రణాళికలు
యాదాద్రి పునర్నిర్మాణం తరహాలోనే వేములవాడ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. 37 ఎకరాల్లో ఆలయ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాజన్న ఆలయం 16 గుంటల్లో విస్తరించి ఉండగా… దాన్ని 40 గుంటలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండో ప్రాకారం నిర్మాణం, గుడి చెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించడం, శివ కల్యాణాన్ని వేలాది మంది వీక్షించేలా వేదికల నిర్మాణం, బ్రహ్మ పుష్కరిణిని ఆధునీకరించడం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ వంటివి చేపట్టనున్నారు.

-త్వరలో శృంగేరి పీఠాధిపతి వద్దకు కేసీఆర్‌..
సీఎం కేసీఆర్‌ త్వరలోనే శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ జగద్గురు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులు తీసుకుని వేములవాడ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి భారతీ తీర్థ స్వామికే ఆగమశాస్త్ర సలహాదారు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి చిన జీయర్‌ స్వామికి ఆగమశాస్త్ర బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌.. ఇప్పుడు భారతీ తీర్థ స్వామి వద్దకు వెళ్లబోతుండటం చర్చనీయాంశంగా మారింది. చిన జీయర్‌తో చెడినందు వల్లే కేసీఆర్‌ భారతీ తీర్థ స్వామి వద్దకు అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

సహజంగానే ఆధ్యాత్మికంలో వైష్ణవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పీఠాధిపతులు, గురువులు, అగ్రవర్ణాల వారు వైష్ణవాన్నే ఎక్కువగా నమ్ముతుంటారు. శైవాన్ని పట్టించుకోరు. శైవాన్ని పట్టించుకున్నా అది ఎఫెక్ట్ అవుతుందని.. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతాయని ఒక టాక్ ఉంది. అందుకే శైవ క్షేత్రాలకు దక్షిణాదిన నాయకులు పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా వైష్ణవానికి చెందిన వ్యక్తి అని.. శైవాన్ని పట్టించుకోరన్న అపవాదు ఉంది. ఇప్పుడు అవి తీవ్రం కావడంతో దాన్ని పోగొట్టడానికే శైవాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. దీనివెనుక మత సమ్మేళనంతోపాటు ఆ వర్గాలను సంతృప్తి పరిచే ఎత్తుగడగా భావిస్తున్నారు.

Also Read: Telangana Salaries: తెలంగాణలో ఏపీ సీన్ రిపీట్.. ఏం జరుగుతోంది..?

Tags