CM KCR: దేరీజ్.. ఇన్ఫ్రంట్ ఆఫ్ క్రొకొడైల్ ఫెస్టివల్.. ఇది అందరికీ తెలిసిన సామెతే.. కానీ దీనిని శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ తన మామతో చెప్పిన విధానం, అప్పుడు మామ ఫేసులో ఎక్స్ప్రెషన్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పటికీ అందరి నోళ్లలో నానేలా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూడా బీఆర్ఎస్, జాతీయ రాజకీయాలు, తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు విషయంలో ఇదే ప్రశ్న సొంత పార్టీ కేడర్ నుంచి ఎదురవుతోంది. ఆ సమయంలో కేసీఆర్ ముఖ కవళికలు కూడా ఆయనలోని అసహనాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు కారణం రాజకీయం ఇంతకాలం ఒకెత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్న విషయం గులాబీ బాస్కు అర్థమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని వైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని కేసీఆర్ తట్టుకుంటారా? రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని నిలబెడతారా? అన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది.

నాటి రోజులు కావు కాక..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత అదె సెంటిమెంటుతో కేసీఆర్ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఇంతకాలం గట్టి ప్రతిఘటన ఎదురు కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటూ ఏ పార్టీ ఆందోళన చేసినా వాటిని పోలీసులతో అణచివేశారు. తనదైన శైలిలో పాలన సాగిస్తూ ముందుకు సాగారు. ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగించడం, ప్రజల నుంచి కూడా మద్దతు లభించడం సీఎం కేసీఆర్పై ఒత్తిడి పెంచుతోంది. ఇక ఇదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కూడా పాదయాత్ర చేయడం, పాదయాత్రలో ఆమె ప్రధానంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసుకోవడం కూడా గులాబీ బాస్ను టెన్షన్ పెడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంది. రేవంత్రెడ్డి కూడా కేసీఆర్ను నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ముప్పేటా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడి
కేంద్రంలోని బీజేపీతో తలపడుతున్న కేసీఆర్పై బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఒకపక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ కవితను విచారించడం, తెలంగాణలోని ముఖ్య నాయకులను, వ్యాపారవేత్తలను ఐటీ, ఈడీ టార్గెట్ చేయడం, క్యాసినో కుంభకోణం, తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులపై ఐటీ దాడులు, సీబీఐ విచారణతో కేసీఆర్పై ఒత్తిడిని తీవ్రం చేశాయి. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాడన్న ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్కు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులూ భావిస్తున్నారు. తెలంగాణలో గెలిస్తేనే బీఆర్ఎస్ను జాతీయ రాజకీయాల్లో తీసుకెళ్లడానికి కేసీఆర్కు మార్గం సుగమమవుతుంది. ఓడితే మాత్రం బీఆర్ఎస్ రాష్ట్రం దాటడం కష్టమే.

కేసీఆర్ కల నెరవేరుతుందా?
బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్న ఆందోళన కూడా కేసీఆర్ను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తోంది. గతానికి భిన్నంగా సీఎం కేసీఆర్పై తాజా పరిణామాలతో ఊహించని విధంగా ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిని తట్టుకుని బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారా.. తెలంగాణలోనే కాకుండా దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ కల నెరవేరుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.