యాసంగిలో వరి ఉత్పత్తిపై సీఎం కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. ఈ యాసంగిలో తెలంగాణ నుంచే అత్యధికభాగం ధాన్యం సేకరణ చేశామని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సీఎండీ డీవీ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్ ను తెలంగాణ రైతులు సమర్థంగా వినియోగించుకొని, తమ వృత్తి నైపుణ్యంతో బ్రహ్మాండమైన పంటలు పండించారని సీఎం ప్రశంసించారు.
దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని దీంతో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా అవతరించిందని సీఎం కేసీఆర్ అభినందించారు. యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ నుంచి, మిగతా అన్ని రాష్ర్టాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్టు తెలుపడం రాష్ర్టానికి గర్వకారణమని చెప్పారు.
కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డుస్థాయి కొనుగోళ్లు చేపట్టాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్టు స్పష్టంచేశారు. ఈ సారి ఎఫ్సీఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ సమకూర్చిందన్నారు. తెలంగాణలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్సీఐ విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.