Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌ సాహసం.. మే 6 నుంచే విశాఖ కేంద్రంగా పాలన..?

జగన్‌ సాహసం.. మే 6 నుంచే విశాఖ కేంద్రంగా పాలన..?

CM Jagan
జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన పథకాల మీద.. ఆయన నిర్ణయాల మీద.. ఆయన పాలన మీద ఎన్నో రకాల కేసులు కోర్టులో నమోదయ్యాయి. సర్కారుకు కోర్టుల్లోనూ ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. కానీ.. ఆయన ఎక్కడా బెదిరినట్లుగా కనిపించడం లేదు. అటు రాజధానితో ముడిపడి ఉన్న భూకుంభకోణంలో ఏకంగా సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణపైనే ఫిర్యాదులు చేశారు. జడ్జిలపై ఏపీ సీఎం ఫిర్యాదు తర్వాత హైకోర్టులో చిన్నచిన్న మార్పులు జరిగాయే తప్ప మూడు రాజధానుల వివాదాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వచ్చే నెలలో జస్టిన్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న దరిమిలా అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

దీనికితోడు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా రాజధానుల విషయంలో జగన్ సాహసోపేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే విషయంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. రెండు రోజుల కిందటే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన ఆయన తాజాగా వివిధ శాఖల అధిపతులు (హెచ్ఓడీల)ను విశాఖ పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమారు 130 మంది హెచ్ఓడీలకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని, సదరు అధికార యంత్రాంగం తమకు అనువైన ప్రాంతాలను ఎంచుకునేందుకు విశాఖలో తిష్టవేసినట్లుగా తెలుస్తోంది.

ఒక్కో హెచ్ఓడీ పరిధిలో సుమారు 120 నుంచి 150 మంది వరకు విధులు నిర్వహిస్తుండగా.. వాళ్లందరికీ అనుకూలమైన భవన సముదాయాలను విశాఖలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచించారని తెలుస్తోంది. కొత్త రాజధానిలో ఎప్పటి నుంచి పాలన ప్రారంభించాలనేదానిపైనా ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అమరావతి నుంచి హెచ్ఓడీలను విశాఖకు తరలించేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 6వ తేదీ నుంచి అన్ని శాఖలు విశాఖ కేంద్రంగా పనిచేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా మే 30 నాటికి జగన్ సీఎంగా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మే 6 నుంచి విశాఖలో హెచ్ఓడీలను ప్రారంభిస్తే, 24 రోజుల్లోపు పరిపాలనను గాడిలోకి తీసుకొచ్చి, ముచ్చటగా మూడో ఏడాది నుంచే మూడు రాజధానుల నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం తెలసిందే. మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర నిర్ణయాలను సమర్థించింది. విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేసే విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. మే 6 నాటి హెచ్ఓడీలను తరలించాలని, ఆ తర్వాత సచివాలయాన్ని కూడా తీసుకెళతారని తెలిసింది. విశాఖను పూర్తి స్థాయి పాలనా రాజధానిగా కొనసాగించేందుకు మే 6ను మైలురాయిగా సర్కారు భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన కర్నూలుకు సమీపంగా సరికొత్త ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. ఎయిర్ పోర్టు వద్ద జాతీయ జెండాతోపాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు. న్యాయరాజధాని కర్నూలు నుంచి పాలనా రాజధాని విశాఖకు తొలి విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. కాగా.. కోర్టుల్లో చిక్కులు ఉన్నా మూడు రాజధానులపై జగన్ దూకుడు చర్చనీయాంశమైంది. వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్వవహారం కాబట్టి అమరావతి భూకుంభకోణం లేదా మూడు రాజధానుల వివాదాలపై కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేరుగా పరిశీలించే అవకాశాన్ని తీసుకోకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version