Site icon OkTelugu

Janasena TDP : జనసేన, టీడీపీ పొత్తుపై నేడు క్లారిటీ?…పొలిటికల్ అడ్వయిజరీ కమిటీతో పవన్ భేటీ…

Janasena TDP : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 16 నెలల వ్యవధి ఉన్నా అన్ని పార్టీలు రివ్యూలు, క్యాండిడేట్స్ ను డిసైడ్ చేయడంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పటికే సీఎం జగన్ నియోజకవర్గాల వారీగా 50 మంది యాక్టివ్ నాయకులను సెలెక్ట్ చేసుకొని రివ్యూ చేస్తున్నారు. పార్టీ లోటుపాట్లు, స్థానిక ఎమ్మెల్యే పనితీరును మదింపు చేస్తున్నారు. అటు ఐ ప్యాక్ బృందం, నిఘా వర్గాల నివేదికలను క్రోడీకరించి లోపాలను ప్రస్తావిస్తున్నారు. స్థానిక కేడర్ నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం నియోజకవర్గ సమీక్షలు చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గ ఇన్ చార్జిలను రప్పించి పరిస్థితులను ఆరాతీస్తున్నారు. ఎక్కడ వెనుకబడి ఉన్నామో గుర్తిస్తున్నారు. పొత్తుకు సంబంధం లేని.. ఎటువంటి వివాదం లేని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను లోపయికారీగా డిసైడ్ చేసి పనిచేసుకోవాలని పురమాయిస్తున్నారు.

అటు జనసేన అధ్యక్షుడు సైతం పార్టీపై ఫోకస్ పెంచారు. అక్టోబరు నుంచి బస్సు యాత్రకు తలపెట్టినా.. దానిని తాత్కాలికంగా వాయిదా వేసి నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు మొదలు పెట్టారు. అసలు జనసేన గెలుపునకు అవకాశం ఉన్న నియోజకవర్గాలేవీ? ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది? అన్నదానిపై దృష్టిపెట్టారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతల చేరిక విషయంలో కూడా అచీతూచి వ్యవహరిస్తున్నారు. అటువంటి నేతలను గుర్తించి.. వారి బలాబలాలు ఏంటి? పార్టీలోకి వస్తే గెలుపోటములు ప్రభావితంచేసే ఉందా? అన్న వివరాలను ఆరాతీసే పనిని నిఘా వర్గాలకు అప్పగించారు. మరోవైపు సంక్రాంతి తరువాత సినిమాలకు తాత్కాలికంగా గుడ్ బై చెప్ప పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెంచడానికి పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తుపై కూడా కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు ఆదివారం మంగళగిరి పార్టీ కేంద్రకార్యాలయంలో జనసేన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశం వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా పొత్తులపై స్పష్టతనిచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలు, పవన్ బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది… పార్టీభవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటనచేసే అవకాశముంది. ఒక వేళ టీడీపీతో కలిసి నడవాలనినిర్ణయానికి వస్తే ఎన్ని సీట్లు అడగాలి? అన్నదానిపై సమావేశంలో చర్చించే అవకాశమైతే ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ సర్కారుపై పోరు మరింత తీవ్రతరం చేయాలని జనసేన నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళితే వైసీపీని కార్నర్ చేయవచ్చో నేతలను అడిగి తెలుసుకునే అవకాశముంది. ఇప్పటికే పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో సభ్యులతో పాటు పార్టీ కీల క నేతలకు ఆహ్వానాలు పంపారు. ప్రాంతాలు, నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను నివేదిక రూపంలోతయారుచేసి రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మొత్తానికైతే జనసేన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరగనుంది. పొత్తులపై క్లారిటీతో పాటు అధికార పార్టీపై పవన్ యుద్ధ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version