Homeఆంధ్రప్రదేశ్‌CID Actions : టీడీపీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపిన సీఐడీ

CID Actions : టీడీపీ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపిన సీఐడీ

CID Actions : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై సిఐడి ఫోకస్ పెట్టింది. ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ హెచ్చరించడం విశేషం. ముఖ్యంగా సీఎం కుటుంబ సభ్యులకు పోస్టులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మారుపేరులతో పోస్టులు పెడితే ఎవరికీ తెలియదని అనుకోవడం పొరపాటు అని.. ఫేక్ ఎకౌంట్స్ సైతం పట్టుకుంటామని సిఐడి చీఫ్ హెచ్చరించడం విశేషం.

సోషల్ మీడియా విషయంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఒకప్పుడు సమాచార వ్యవస్థకు కీలకంగా సోషల్ మీడియా ఉండేది. ఇప్పుడు అదే సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలకు వేదికగా మారుతుంది. వ్యక్తిగత హననానికి సైతం కారణమవుతోంది. ప్రతి రాజకీయ పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్ని కొంతమంది ప్రముఖులు కొందరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టులు పెడుతుంటారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా ప్రముఖులు, వారి పేరిట పెడుతున్న పోస్టులు వివాదాస్పదంగా మారుతున్నాయి. చివరికి ఇది ప్రభుత్వ అధినేతలతో పాటు న్యాయవ్యవస్థపై దుష్ప్రచారానికి కారణం అవుతోంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు సైతంఅసౌకర్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా దూకుడుగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో కీలక భూమిక వహిస్తోంది. ప్రభుత్వం పాలన వైఫల్యాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అది ప్రభుత్వానికి మైనస్ గా మారుతుంది. అందుకే ప్రభుత్వం సోషల్ మీడియా కట్టడికి.. సిఐడిని ప్రయోగించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకొని.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి విషయంలో సిఐడి ఏం చేస్తోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సిఐడి చీఫ్ సంజయ్ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టిన 19 మందికి నోటీసులు ఇచ్చామని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. అందులో టిడిపి నేత బుద్ధ వెంకన్న సైతం ఉన్నారని చెప్పుకొచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆయనకు సైతం నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయితేకేవలం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలపై మాట్లాడడం ఏమిటని.. వైసిపి నేతల సైతం సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారని.. గతంలో న్యాయస్థానాల ఆదేశాలతో కేసులు సైతం నమోదయ్యాయని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని నియంత్రించడం హర్షించదగ్గ పరిణామమే అయినా.. ఈ విషయంలో విపక్షాలను టార్గెట్ చేయడం తగదని.. అన్ని పార్టీల నేతల సోషల్ మీడియా ఖాతాలపై ఫోకస్ పెంచాలని కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version