Chiranjeevi Viral Video: గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి జగనన్నా.. చిరంజీవి వీడియో వైరల్

చిరంజీవి విషయంలో ఏపీ సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : January 29, 2024 2:49 pm
Follow us on

Chiranjeevi Viral Video: ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ కు దేశవ్యాప్తంగా ఐదు గురు ప్రముఖులను ఎంపిక చేయగా అందులో చిరంజీవి ఒకరు కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఆలోచింపజేస్తున్నాయి. చిరంజీవి విషయంలో ఏపీ సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఏపీలో సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో.. సినిమా టిక్కెట్ల ధరను తగ్గిస్తూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను తెచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమను తక్కువ చేస్తూ అప్పటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేకున్నా… సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వంతో చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి చొరవ చూపారు. ఇతర సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో కలిసి సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తండ్రి స్థానంలో ఉన్న తమరు ఒకసారి ఆలోచించాలని నమస్కరిస్తూ జగన్ కు విజ్ఞప్తి చేశారు. కానీ జగన్ ఆ స్థాయిలో స్పందించలేదు. దీనిని పవన్ సైతం తప్పు పట్టారు. మెగాస్టార్ లాంటి లెజెండ్రీ పర్సన్ సైతం వంగి నమస్కారం పెట్టే స్థాయికి జగన్ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

అక్కడకు కొద్ది రోజులు పోయాక ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, పర్యాటక శాఖ మంత్రి రోజా వేదికపై ఉండగా.. ప్రధాని మోదీ నేరుగా చిరంజీవి వద్దకు వచ్చి పలకరించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకొని సంభాషించారు. చిరంజీవి నుంచి చిరు సత్కారాన్ని తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ కంటే ప్రధాని మోదీ చిరంజీవికే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఏవేవో ఊహాగానాలు వచ్చాయి.

తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు లభించడంతో.. ఈ ఘటనలను గుర్తు చేసుకుంటూ.. గౌరవం అంటే ఒకరు ఇచ్చేది కాదని.. అది ఇచ్చిపుచ్చుకునే స్థితిలో ఉండాలని గుర్తు చేస్తూ.. మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాడు చిరంజీవి విషయంలో జగన్ అనుసరించిన తీరును తప్పుపడుతూ.. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని హెచ్చరిస్తూ చేసిన పోస్టులు ఆలోచింపజేస్తున్నాయి. నెటిజెన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి స్థాయి, గౌరవం అవి అంటూ ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు.