ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ పతనావస్థకు చేరుకుంటోందా? అని స్వయంగా ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెండేళ్ల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీ.. ఇప్పుడు మనుగడ కోసం అవస్థలు పడే పార్టీగా తయారవడం వారిని నైరాశ్యానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. వచ్చే 2024 ఎన్నికల్లో గనక ఓటమిపాలైతే.. పరిస్థితులు ఇంకెంత దిగజారిపోతాయో అనే భయాందోళన వారిని నిలువనీయట్లేదు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
లాభనష్టాను బేరీజు వేసుకుంటూ సైకిల్ రిపేర్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా బాబు చర్యలను చూస్తే అర్థమవుతోంది. పార్టీలో పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న సీనియర్ నాయకత్వాన్ని పక్కన పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆర్థికంగా బలవంతులను సైతం ఏరికోరి సెలక్ట్ చేసుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం వైసీపీతో కంపేర్ చేసుకున్నప్పుడు దూకుడైన నేతలతోపాటు ఆర్థికంగానూ టీడీపీ సమఉజ్జీగా లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి.. సైకిల్ ను రేసులో నిలపాలని భావిస్తున్నారు.
అదే సమయంలో.. తర్వాత పార్టీని లీడ్ చేయాలని భావిస్తున్న కొడుకు లోకేష్ కు ఎదురు లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే మొదలు పెట్టారు బాబు. లోకేష్ పై ఒకరకమైన ముద్ర పడడంతో.. అతన్ని పార్టీలోని సీనియర్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో.. సీనియర్లుగా ఉన్నవారంతా ఇప్పుడు ఫేడౌట్ పొలిటీషియన్లుగా మారిపోయారనే అంచనాకు సైతం బాబు వచ్చారట. దీంతో.. సీనియర్లను పక్కన పెట్టేసి.. యువకులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. ఇది వచ్చే ఎన్నికల నాటికి పార్టీని లైన్ మీదకు తీసుకురావడంతోపాటు.. భవిష్యత్ లో లోకేష్ కు యువకులు అనుకూలంగా మారే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారట.
అందుకే.. యువ నేతలను తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. యర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గా ఎరిక్సన్ బాబును నియమించడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నిజానికి ఆయనది కనిగిరి నియోజకవర్గం. యర్రగొండపాలెంలో ఉన్న సీనియర్లను, ఆశావహులను కాదని ఎరిక్సన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇదేవిధంగా తిరువూరులోనూ ఎన్నారై దేవదత్ ను నియమించారు. సీనియర్ నేత స్వామిదాస్ ను కాదని మరీ.. దేవదత్ కు స్టీరింగ్ ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలోనూ ఊహించని వారికి పదవి కట్టబెట్టారు.
ఇలా జూనియర్లకు పదవులు కట్టబెట్టడంతోపాటు సీనియర్లను పక్కనపెట్టి, వారి కుమారులను తెరపైకి తేవాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో వారికే టిక్కెట్లు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట. మొత్తంగా సీనియర్లను పక్కనపెడితే.. మొదటికే మోసం వచ్చే అవకాశం కూడా ఉండడంతో.. ఈ ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి.. సైకిల్ ను ఎలక్షన్ రేసులో పెట్టేందుకు మూడేళ్లు ముందుగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి, చంద్రబాబు వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి.