మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య కాలంలో కాలం కలిసి రావడం లేదు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏం బాగోలేదు. చంద్రబాబు పార్టీని ఎంతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నా పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. టీడీపీని జాతీయ పార్టీగా చెప్పుకునే చంద్రబాబు పార్టీ ఏపీలో కూడా బలహీనపడటంతో ఆందోళనకు గురవుతున్నారు.
గతంతో చంద్రబాబును అభిమానించే వాళ్లు జాతీయ స్థాయి రాజకీయాలలో బాబు ఒంటి చేతితో చక్రం తిప్పారనే కామెంట్లు చేసేవారు. బాబు సొంత మీడియా సైతం జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని లెక్కకు మించిన కథనాలను ప్రసారం చేశాయి. కట్ చేస్తే 2019 ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశంలో ఎందరో గొప్ప నేతలు పదవులు పొందడానికి కారణమని చంద్ర బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే అలాంటి గొప్ప నేత అయిన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో అవమానం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పదవీ కాలం నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభలో చెప్పుకోదగ్గ మెజారిటీ లేకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడం కోసం ప్రయత్నాలు చేసినా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఎన్డీయే కూటమి తరపున మరోమారు జేడీయూ ఎంపీ హరివంశ్ పోటీ చేయనుండగా ప్రతిపక్షాల తరపున ఆర్జేడీ ఎంపీ మనోజ్కుమార్ ఝా నిన్న నామినేషన్ వేశారు. బిహార్ సీఎం నితీష్కుమార్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు కావాలని కోరగా చంద్రబాబుకు మాత్రం పాలకప్రతిపక్షాల నుంచి ఫోన్ కాల్ రాలేదు. చంద్రబాబుకు ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం.