Petrol Diesel Excise Duty Cut: పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదు. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంధన ధరలు పెంచాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత ప్రభుత్వం కూడా ఎల్పీజీ ధరలు పెంచింది. అయితే ఈ సంక్షోభం వేళ కేంద్రం సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థికశాఖ గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…
కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి ఊరట..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.13 నుంచి రూ.3కు తగ్గుతుంది. లీటర్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. అంటే రూ.10 తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వచ్చింది.
యుద్ధం నేపథ్యంలో కేంద్రం వ్యూహం
ఇరాన్–అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ వంద డాలర్లు దాటింది. అయినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్/డీజిల్పై దాదాపు రూ.48 వరకు నష్టం చవిచూస్తున్నాయి. ఈ నష్టాల భారాన్ని ప్రజలపై మోపకుండా ఉండటానికే కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చమురు కంపెనీలకు ఊరట
ఇటీవల నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచేసింది. మిగతా చమురు కంపెనీలు కూడా ఆ బాటపట్టే అవకాశం ఉండటంతో, కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గకపోయినా, కంపెనీలు ధరలను పెంచాల్సిన అవసరం తప్పుతుంది. ఇంధన ధరల భారం ప్రజలపై పడకుండా ఉంటుంది. చమురు కంపెనీల నష్టాలు తగ్గి, ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి.
సామాన్యుడిపై ప్రభావం
కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి ప్రత్యక్షంగా ధరల తగ్గింపు కనిపించకపోయినా, భవిష్యత్తులో ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయి. యుద్ధం కారణంగా చమురు ధరలు మరింత పెరిగినా, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు కారణంగా దేశీయ ధరలపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కూడా దోహదపడుతుంది.
ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి పరోక్ష ఊరటనిస్తుంది. చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ, ప్రజలపై అదనపు భారం మోపకుండా జాగ్రత్త పడింది. యుద్ధ పరిస్థితులు చక్కబడి, అంతర్జాతీయ ధరలు స్థిరపడితేనే ప్రత్యక్ష ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.