Teachers- YCP Govt: ఏపీ సర్కారుకు ఉపాధ్యాయులు షాకిచ్చారు. సెల్ డౌన్ ప్రకటించారు. ఉపాధ్యాయుల హాజరు విషయంలో ప్రభుత్వం సిమ్స్ ఏపీ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి పక్కాగా అమలుచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ దీనిపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. యాప్ నకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులు సొంత ఫోన్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మూడు కోణాల్లో హాజరు నమోదు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉదయం 9 గంటల్లోగా యాప్ లో హాజరు నమోదుకాకపోతే సెలవుగా పరిగణిస్తామని కూడా ప్రకటించింది. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు యాప్ డౌన్ లోడ్, వివరాల నమోదుకు ఆపసోపాలు పడ్డారు. సాంకేతిక సమస్యతో తొలిరోజే వేలాది మంది ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. విద్యార్థుల ప్రార్థనా సమయంలో పాఠశాల ప్రాంగణాల్లో సెల్ ఫోన్లతో కుస్తీలు పట్టారు. ఇంతలో ఉపాధ్యాయ సంఘాల నుంచి సమాచారం వచ్చింది. ఉపాధ్యాయుల హక్కులను నిర్వీర్యం చేసే యాప్ నకు దూరంగా ఉండాలని ఆదేశాలు రావడంతో ప్లే స్లోర్ లో యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న చాలా మంది ఉపాధ్యాయులు దానిని తొలగించారు.
ఫ్యాప్టో పిలుపుతో..
ఏపీలో 1.8 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారందరికీ ఏపీ సిమ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పాఠశాల మంత్రిత్వ శాఖ సూచించింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? హాజరు ఎలా వేసుకోవాలి? అన్న మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. కానీ మంగళవారం ఉదయం నాటికి కేవలం 30 వేల మంది ఉపాధ్యాయులే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇలా డౌన్ లోడ్ చేసుకున్న వారు కూడా పూర్తిస్తాయిలో వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంతలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఫ్యాప్టో పిలుపు మేరకు సెల్ డౌన్ పాటించారు. ఇప్పటికే పాఠశాల విలీన ప్రక్రియ, 117 జీవోను రద్దుచేయాలని గత కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు సందట్టో సడేమియా అన్నట్టు యాప్ ను అందుబాటులోకి తేవడమే కాకుండా ఉన్నపలంగా అమలుచేయడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
Also Read: FIFA Announces Suspension Of AIFF: భారత ఫుట్ బాల్ సంఘంపై నిషేధం.. ఎందుకీ పరిస్థితి? అసలు కారణాలేంటి?
ఎవరి వాదన వారిది..
ఆర్డిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ టెక్నాలజీతో యాప్ ను రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆన్ లైన్ విధానంలో హాజరు వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. కానీ దీనికి ప్రత్యేక విధానం తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే 12 రకాల యాప్స్ నమోదుతో అసౌకర్యానికి గురవుతున్నామని చెబుతున్నారు. బోధన కంటే బోధనేతర పనులే అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ వాదన మాత్రం వేరేలా ఉంది.
ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరుకావడం లేదని.. బయోమెట్రిక్ విధానాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పారదర్శకత కోసమేనని చెప్పుకొస్తోంది. అయితే ఇది ముమ్మాటికీ తమపై కక్ష సాధింపేనని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. తమ న్యాయసమ్మతమైన హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే యాప్ ను ప్రవేశపెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న యాప్ లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని..వాటికి పరిష్కార మార్గం చూపకుండా కొత్తగా యాప్ ను ఎలా అందుబాటులోకి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే సరికొత్త యాప్ ఏపీ సర్కారు, ఉపాధ్యాయుల మధ్య చిచ్చు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:AP Government- CAG: ఏపీని పట్టించుకోరా? లెక్కా పత్రాలు లేవా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More