Telangana Politics : తొమ్మిది మందిని ఓడించి ఒక్కడివే గెలుద్దామనకుంటున్నావా మంత్రివర్యా!

తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఎవరిది వారు కడుకుంటే మంచిదని, ఎదువారిని కడగాలని చూస్తే గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు.

Written By: NARESH, Updated On : September 8, 2023 8:24 pm
Follow us on

Telangana Politics :  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ నిప్పులు చెరిగారు. తనకు టిక్కెట్‌ రాని తర్వాత తొలిసారి మంత్రి పువ్వాడపై ఎమ్మెల్యే రాములునాయక్‌ తనలో ఉన్న గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘మీరు రాష్ట్రానికి మంత్రా… లేక వైరాకు ఎమ్మెల్యేనా’ అని సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల మధ్చ చిచ్చుపెట్టి చలి కాగుతున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిదిమంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి ఒక్కడివే గెలుద్దామా అనుకుంటున్నావా అని నిలదీశారు. ఎన్నికలు జరిగే వరకు నేనే వైరాకు ఎమ్మెల్యేని అని, ఇక్కడ నీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం వైరాలో నియోజక వర్గంలోని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో అత్యవసరంగా విస్తృతస్థాయి సమావేవాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణంలో నిర్వహించారు.

ఆగ్రహానికి కారణం ఇదే

రెండోవిడత దళితబంధు లబ్ధిదారుల జాబితాలను మండలస్థాయి స్టీరింగ్‌ కమిటీల ప్రతిపాదనలతో ఎమ్మెల్యే రాములునాయక్‌ కలెక్టర్‌కు పంపించారు. అయితే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన బాణోతు మదన్‌లాల్‌ తయారుచేసిన జాబితాను మంత్రి పువ్వాడ ఆమోదించడంతో దాన్ని పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రిపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గుణపాఠం తప్పదు

రాజకీయంగా తనను తొక్కాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మంత్రి పువ్వాడను హెచ్చరించారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఎవరిది వారు కడుకుంటే మంచిదని, ఎదువారిని కడగాలని చూస్తే గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రాజులా, మంత్రి కేటీఆర్‌ యువరాజులా సుపరిపాలన చేస్తుంటే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లాలో సామంతరాజులా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను గౌరవించి ప్రొటోకాల్‌ పాటించాలని తెలియదా అంటూ నిలదీశారు. మూడుసంవత్సరాలుగా తనను మంత్రి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు తానే ఎమ్మెల్యేనని రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్ని ఎమ్మెల్యేల ద్వారా అమలుచేస్తుంటే వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యేని అయిన తనను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. తనను కాదని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ఇచ్చిన దళితబంధు జాబితాను మంత్రి ఆమోదించి అధికారులకు ఎలా పంపించారని ప్రశ్నించారు. టిక్కెట్‌ వచ్చిన అభ్యర్థి మదన్‌లాల్‌ గిరిజనుడేనని ఆయన తన బావేనని ఆయన గెలుపు ఖాయమని ఈ పరిస్థితుల్లో గిరిజనులైన తమ మధ్య విభేధాలు సృష్టించి ఆమంటల్లో చలి కాసుకుంటున్నారని ఆరోపించారు.