Revanth Reddy : రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ లీగల్ సంచలన ఫిర్యాదు

కేసీఆర్‌ చెబుతున్న పథకాలనే ఫెల్యూర్‌ పథకాలుగా కాంగ్రెస్‌ చూపుతోంది. ఇది బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. దీంతో ప్రకటనలకు కూడా బ్రేక్‌ వేయించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈసీని ఆశ్రయిస్తోంది.

Written By: NARESH, Updated On : November 13, 2023 9:33 pm
Follow us on

Revanth Reddy : తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఫిర్యాదుల పర్వానికి తెరలేచింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన మొదలుకాగా.. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఎన్నికల ప్రచార ప్రకటనలపై ఈ ఫిర్యాదులు అందడం విశేషం. గతంలో ఆయా పార్టీల గొప్పలు చెప్పుకునేలా ప్రకటనలు ఉండేవి, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు మరీ శృతి మించాయనే ఆరోపణలు వినపడుతున్నాయి.

సీఈవోను కలిసిన బీఆర్‌ఎస్‌ లీగల్‌టీం..
ఫిర్యాదులు పంచాయితీ ఈసీ వరకు చేరింది. సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్‌ఎస్ లీగల్ టీం సోమవారం కలిసింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా ఉన్న కాంగ్రెస్ యాడ్స్‌ ఆపాలని మరోసారి లీగల్ టీం ఫిర్యాదు చేసింది. అనంతరం బీఆర్‌ఎస్ లీగల్ బృందం నేత సోమా భరత్ మాట్లాడుతూ.. పచ్చగా ఉన్న తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థలపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

ప్రకటనలను జీరి‍్ణంచుకోలేక..
ఇదిలా ఉండగా, తెలంగాణలోపదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ రూపొందిస్తున్న ప్రకటనలు ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పత్రిలకు కోట్ల రూపాయలు పోసి ప్రకటనలు ఇచ్చినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ, వీడియో రూపంలో కాంగ్రెస్‌ చేస్తున్న ప్రకటలు, టీవీ చానెళ్లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. కేసీఆర్‌ చెబుతున్న పథకాలనే ఫెల్యూర్‌ పథకాలుగా కాంగ్రెస్‌ చూపుతోంది. ఇది బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. దీంతో ప్రకటనలకు కూడా బ్రేక్‌ వేయించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈసీని ఆశ్రయిస్తోంది.