Madhya Pradesh Election 2023
Madhya Pradesh Election 2023: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అదే సమయంలో సిట్టింగ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ను తిరిగి నిలబెట్టుకుంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో గెలిచినా.. తన ఖాతాలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ను కోల్పోయింది. ఇక అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనూహ్యంగా అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్ను నిలుపుకోవడంలో బీజేపీ చేసిన అభ్యర్థుల మార్పు సత్ఫలితాలు ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అభ్యర్థుల మార్పే విజయ రహస్యం..
మధ్యప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించబోతోంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై అక్కడ వ్యతిరేకత ఉందన్న వాదనలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే వెల్లడించాయి. కానీ, అనూహ్యంగా తాజా ఎన్నికల్లోనూ విజయం వైపు దూసుకుపోతోంది. శివరాజ్సింగ్ చౌహాన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ వ్యూహాత్మకంగా అధిగమించింది. అక్కడ మెజారిటీ అభ్యర్థులను బీజేపీ మార్చింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులందరినీ కమలనాథులు పక్కన పెట్టారు. సీనియర్ నాయకులు అయినా.. తప్పిచే విషయంలో వెనుకాడలేదు. గ్రౌండ్ సర్వే అధారంగానే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో బీజేపీ చేసిన ప్రయోగం అక్కడ సత్ఫలితాలు ఇచ్చింది. 230 స్థానాలు ఉన్న అక్కడి అసెంబ్లీలో ప్రసుతం బీజేపీ మూడోసారి కూడా భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రాబోతోంది. ఇప్పటికే 165 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
బీఆర్ఎస్ చేపిన పొరపాటు అదే..
ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలో ఉంది. ఈసారి కూడా విజయం సాధించి సౌత్ ఇండియా చరిత్రను తిరగరాస్తామని అధికార బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఫలితాల ప్రకటనకు కొన్ని గంటల ముందు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబరాలకు సిద్ధంగా ఉండాటని కార్యకర్తలకు సూచించారు. కానీ కౌటింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్సే ఎగ్జాట్ పోల్స్ అయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరయ్యాయి. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్కన్నా ఎక్కువ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మధ్యప్రదేశ్లో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చకపోవడమే.
సిట్టింగులందరికీ టికెట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే.. సిట్టింగ్ అభ్యర్థులను మార్చకపోవడమే. అభ్యర్థులను మారిస్తే.. వారంతా ఎక్కడ బీజేపీ, కాంగ్రెస్లో చేరతారో అని ఆయన భయపడ్డారు. ఆ ఛాన్స్ విపక్షాలకు ఇవ్వకూడదని, కేవలం పది మందిని మాత్రమే మార్చి మిగతా సిట్టింగులందరికీ టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు రెండ నెలల ముందే టికెట్లు ప్రకటించారు. ప్రచారం చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చెప్పినట్లే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లినా.. సిట్టింగ్లపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లు.. ఓటుతో గులాబీ పార్టీకి బుద్ధి చెప్పారు.