BJP : ఎన్నికలకు ముందే లోక్‌సభ సీటు గెలిచిన బీజేపీ.. విన్నింగ్‌ వెనుక ట్విస్ట్‌

ఎన్నికల అధికారికి సమాధానమివ్వడానికి నీలేష్ కుంభానీ తన న్యాయవాదితో వచ్చారు. అయితే ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో అతని నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి… ఎన్నికల అధికారికి అఫిడవిట్‌ సమర్పించారు.

Written By: NARESH, Updated On : April 22, 2024 8:38 pm

BJP MP Candidate

Follow us on

BJP : పార్లమెంటు ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్నికలకు ముందే బీజేపీ తొలి సీటును తన ఖాతాలో వేసుకుని బోణి కొట్టింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే.. సూరత్ లోక్‌సభ స్థానం గెలిచి చరిత్ర సృష్టించింది.. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ముఖేశ్‌దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏం జరిగిందంటే..
వాస్తవానికి సూరత్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా ముఖేశ్‌ దలాల్‌, కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్‌కుంభానీతోపాటు మరో ఏడుగురు నామినేషన్‌ వేశారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి నిలేశ్‌ సమర్పించిన బీఫాంను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో నామినేషన్‌ చెల్లుబాటు కాలేదు. దీంతో బరిలో బీజేపీ అభ్యర్థితోపాటు మరో ఏడుగురు స‍్వతంత్రులు మిగిలారు. ఇక సోమవారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన ఏడుగురు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యారేలాల్ భారతి బీఫాంను ఉపసంహరించుకున్నారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి ఈ సీటును పోటీ లేనిదిగా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖేశ్‌దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

మూడు రోజుల హైడ్రామా..
సూరత్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ దాఖలు చేశారు. అందులో ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులు సంతకాలు చేశారు. తర్వాత ఆ ముగ్గురు నామనేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించారు. దీంతో నామినేషన్‌ దాఖలు చేసిన మూడు రోజుల వరకు హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని ప్రతిపాదకులుగా అతని బావమరిది జగదీష్ సవాలియా, అతని మేనల్లుడు ధృవిన్ ధమేలియా, భాగస్వామి రమేశ్‌ పొల్లారా అభ్యర్థనను కూడా ఎన్నికల అధికారి వీడియో రికార్డింగ్ చేశారు. ప్రతిపాదకుల వాదనను అనుసరించి, ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థికి సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం ఇచ్చారు. ఎన్నికల అధికారికి సమాధానమివ్వడానికి నీలేష్ కుంభానీ తన న్యాయవాదితో వచ్చారు. అయితే ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో అతని నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి… ఎన్నికల అధికారికి అఫిడవిట్‌ సమర్పించారు.