BJP-TDP: ఏపీలో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు బిజెపికి దక్కాయి. అంటే 16 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. బిజెపిలో చూస్తే 50 మంది వరకు యాక్టివ్ నాయకులు ఉన్నారు. దీంతో పోటీ తీవ్రంగా ఉంది. పైగా టిడిపి, జనసేనతో పొత్తు ఉండడంతో ఈజీగా ప్రజాప్రతినిధిగా మారవచ్చు అన్నది ఆలోచన. అందుకే ప్రతి ఒక్కరూ తోచిన విధంగా లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడే చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎప్పుడు నుంచో జెండా పట్టుకుని తిరిగే వారికి కాకుండా.. ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుండడం విశేషం.
విశాఖ నుంచి హిందూపురం వరకు వినిపిస్తున్న పేర్లు ఒక వర్గానికి చెందిన వారివే. అవసరం కోసం బిజెపిలో కొనసాగుతున్న వారి పేర్లు వినిపిస్తున్నాయి.అవి కూడా ఒకప్పుడు టిడిపిలో యాక్టివ్ గా పని చేసే నాయకులే ఎక్కువగా ఆశావాహులుగా కనిపిస్తుండడం విశేషం. సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్య కుమార్, భాను ప్రకాష్ రెడ్డి, వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డి.. ఇలా పూర్వాశ్రమంలో టిడిపిలో పనిచేసిన నాయకులే బిజెపి ఆశావహులు, అభ్యర్థులు అవుతుండడంతో బిజెపి పాత నాయకులు బెంగతో గడుపుతున్నారు. హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టే స్థితిలో అధిష్టానం లేదు. ఇటీవల ఒక 30 మంది బిజెపి పాత నాయకులు నేరుగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ సానుకూల ఫలితం రాలేదని తెలుస్తోంది.
బిజెపి అగ్రనేతలతో చర్చలు జరిపిన సమయంలోనే చంద్రబాబు కీలక షరతులు పెట్టినట్లు సమాచారం. బిజెపిలో చాలామంది ప్రో వైసిపి నేతలు ఉన్నారని.. అటువంటి నాయకులకు టికెట్లు ఇస్తే టిడిపి,జనసేన ఓటు బ్యాంకు టర్న్ కాదని చెప్పినట్లు సమాచారం. అయితే చంద్రబాబు చెప్పిన ఆ ప్రోవైసిపీ నేతలంతా.. పాత బిజెపి నాయకులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా బిజెపిలోని తనవాళ్ళకు టికెట్ ఇచ్చేందుకు పెద్దపీట వేసుకున్నారు. గమనించాల్సిన బిజెపి హై కమాండ్ ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. తమకు సీట్లు తప్ప మరో ఆలోచన లేదని.. ఎవరికి టిక్కెట్లు ఇస్తే తమకు ఎందుకన్న ఆలోచనతో ఉంది. దీంతో బిజెపి నేతల బాధ వర్ణనాతీతం. కళ్ళేదుటే టిడిపికి చెందిన వలస పక్షులు టికెట్లు దక్కించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమలో తామే మధనపడుతున్నారు