BJP Vs YCP
BJP Vs YCP: వైసీపీ సర్కార్ పై బిజెపి స్వరం పెంచింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పరిమితికి మించి అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారంలో నేడుతున్నారని ఆరోపణలు చేస్తున్న సంగతి విధితమే.
అయితే దీనిపై సిద్ధాంత పరంగా వివరణ ఇవ్వకుండా వైసిపి నేతలు పురందేశ్వరి పై వ్యక్తిగత దాడిని కొనసాగిస్తున్నారు. వైసిపి పై పోరాటం అంటే టిడిపిని వెనుకేసుకు రావడం అన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ టీం గట్టిగానే బదులిస్తోంది. తాజాగా బిజెపి సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తం తొమ్మిది రకాల ప్రశ్నలు లేవనెత్తారు. వాటిపై బీజేపీ పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
1. బాలల అక్రమ రవాణాలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 3 స్థానంలో ఉంది. ఈ వైఫల్యానికి వైసీపీ సర్కార్ సమాధానం ఏమిటి?
2. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎందుకు వెనుకబడింది?
3.జలజీవన్ మిషన్ పథకానికి అయ్యే ఖర్చులు కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?
4. కేంద్రం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు?
5.పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ,గ్రామీణ వైద్య ఆరోగ్య కేంద్రాలు,జిల్లా ఆసుపత్రిలో,జనరల్ ఆసుపత్రిలో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు,వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?
6. 80% కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించడం లేదు? వారికి ప్రభుత్వం ఎందుకు బకాయిలు చెల్లించడం లేదు?
7. ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకార వేతనాలు దూరం చేశారు? డిగ్రీలో తెలుగులో రద్దు చేసి ఆంగ్ల భాషకు ఎందుకు ప్రాధాన్యమిచ్చారు?
8. ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?
9. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను ఎందుకు పునర్ నిర్మించడం లేదు?
ఈ తొమ్మిది ప్రశ్నలతో భారతీయ జనతా పార్టీ జగన్ సర్కార్ పై పోరాటానికి సన్నద్ధమైంది. వీటిపైనే పోరాడాలని డిసైడ్ అయింది. ఈ తొమ్మిది రకాల డిమాండ్లతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తోంది.