ఢిల్లీ పొగలు.. బల్దియా సిగలో కమలం?

జీహెచ్ ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా సాగితే.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరింత రసవత్తరంగా సాగుతోంది. ఆయన అడగటమే ఆలస్యం అన్నట్టుగా.. బీజేపీ అగ్ర నేతలంతా అపాయింట్‌మెంట్లు ఇచ్చి చర్చలు జరుపుతున్నారు. ఆ తర్వాత ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. కానీ.. ఏం మాట్లాడుకున్నారు? అనే విషయం మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినా… రాజకీయ అజెండా లేకుండా చర్చలు ముగుస్తాయని ఎవరూ అనుకోరు. ఈ కోణంలోనే.. అది కూడా కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే ఓ వేడి వేడి […]

Written By: Neelambaram, Updated On : December 13, 2020 2:16 pm
Follow us on


జీహెచ్ ఎంసీ ఎన్నికలు రసవత్తరంగా సాగితే.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరింత రసవత్తరంగా సాగుతోంది. ఆయన అడగటమే ఆలస్యం అన్నట్టుగా.. బీజేపీ అగ్ర నేతలంతా అపాయింట్‌మెంట్లు ఇచ్చి చర్చలు జరుపుతున్నారు. ఆ తర్వాత ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. కానీ.. ఏం మాట్లాడుకున్నారు? అనే విషయం మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినా… రాజకీయ అజెండా లేకుండా చర్చలు ముగుస్తాయని ఎవరూ అనుకోరు. ఈ కోణంలోనే.. అది కూడా కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే ఓ వేడి వేడి వార్త గుప్పుమంది. అదే.. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై బీజేపీ కూర్చోవడం! నమ్మడానికి కాస్త ఆలోచించేలా అనిపిస్తున్నా.. పరిస్థితులను పరిశీలిస్తే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..?

ప్రతిపాదన ఎవరిది?
ఈ ప్రతిపాదన కేసీఆర్ దే అని సమాచారం. మేయర్ పీఠం బీజేపీ తీసుకొని, డిప్యూటీ మేయర్ పీఠం టీఆర్ఎస్‌కు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే.. ఈ ఆఫర్‌పై బీజేపీ స్పందన ఏంటనేది మాత్రం తెలియలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే అతి పెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ రెండో పెద్ద పార్టీగా ఉంది. టీఆర్ఎస్ అడిగితే.. మద్దతివ్వడానికి ఎంఐఎం కు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే.. రాజకీయంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందనే అంచనాకు కేసీఆర్ వచ్చినట్టు సమాచారం.

అందుకే ఢిల్లీకి..?
వాస్తవానికి బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని గులాబీ దళపతి ఊహించి ఉండరు. కొంత నష్టం జరిగిపోయింది కాబట్టి.. ఇంతటితో ఆపాలని నష్ట నివారణ చర్యలకు దిగారని, ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లారని సమాచారం. బీజేపీని కంట్రోల్ చేయాలంటే… ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Also Read: హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..!

కమల దళం ఏమంటుందో?
ప్రస్తుత ఫలితాలతో టీఆరెస్కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కాబట్టి.. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీతో పొత్తుకు అంగీకరించకపోవచ్చు. అయితే.. హైకమాండ్ ఎలా ఆలోచిస్తుంది అన్నది తేలాలి. జాతీయ రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ తో చెలిమి చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. రాజ్యసభలో కాషాయ దళ బలం సరిపడా లేకపోవడం.. ఇటీవల ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరమవడం.. వంటి కారణాలతో.. టీఆర్ఎస్‌ ఆఫర్ కు బీజేపీ ఓకే చెప్పేందుకూ ఆస్కారం ఉందనే వాదన ఉంది.

తేలేది ఆయనొచ్చిన తర్వాతే..
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పరిణామాలను బట్టి ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ బంద్ కు మద్దతు తెలిపిన గులాబీ బాస్.. వచ్చాక ఎలాంటి వైఖరితో ఉంటారు? అన్నది చూడాలి. దూకుడు తగ్గిస్తారా? స్వరం పెంచుతారా? అనే విషయాలను బట్టి.. పొత్తు ముచ్చట ఏమైందో అర్థం చేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్