‘‘తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేనట్టేనా..?’’ ఇది ఎవరో బయటి వాళ్లు అంటున్న మాట కాదు. సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. తెలంగాణలో ఆల్మోస్ట్ జెండా పీకేసినట్టే! మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఏపీలోనూ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓ వైపు అధికార పక్షం నుంచి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు.. సొంత పార్టీ నుంచి కూడా పొగలు సెగలు తగులుతున్నాయి. ఈ విధంగా గతంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటోంది టీడీపీ.
అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన పరాభవం.. విరామమన్నదే లేకుండా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, ఆ తర్వాత మునిసిపల్ పోరులోనూ సైకిల్ కు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. లేటెస్ట్ గా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. దీంతో.. వైసీపీని నేరుగా ఎదుర్కోలేమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారు. మొన్న జరిగిన మహానాడులో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు సాక్ష్యాలుగా పరిగణించొచ్చు. రాబోయే రోజుల్లో విపక్షాలను కలుపుకుని అధికార పక్షంపై పోరాడాలని తీర్మానించారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటనేది ఈ తీర్మానమే చాటి చెబుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఎంతగా డీలా పడిపోయిందో ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీని ఎదుర్కోలేక విపక్షాల సహాయం కోసం టీడీపీ ఎదురు చూస్తుండడం.. ఆ పార్టీ పతనావస్థను సూచిస్తోందని అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీని తోడు తెచ్చుకొని.. వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బాబు తలపోస్తున్నారని, తపిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు.
అయితే.. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసేది లేదని తెగేసి చెబుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. రాష్ట్రంలోనూ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గమనిస్తే.. టీడీపీ పతనాన్ని పరిశీలిస్తే.. బీజేపీ పుంజుకుంటోందన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. అందుకే.. చంద్రబాబు బీజేపీ దోస్తీ కోరుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
ఈ సంధికాలాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని భావిస్తున్న బీజేపీ.. చంద్రబాబును దగ్గరికి రానిచ్చేది లేదని అధికారికంగా ప్రకటించింది. తాజాగా.. విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షుడు సోమూ వీర్రాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. కేంద్ర మంత్రి మురళీధరన్, సనీల్ థియోధర్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో తాము ఏ విషయంలోనూ కలిసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చారు. ఈ విధంగా చూస్తే.. టీడీపీ ప్లేసును బీజేపీ ఆక్రమిస్తోందనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు విశ్లేషకులు.