హుజురాబాద్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పారు. శామీర్ పేటలో తన ఇంటిలో విందు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే సమాలోచనలు చేశారు. తరువాత అనుచరులతో గన్ పార్కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా ఈటల ఉద్వేగభరితంగా మాట్లాడారు.
హుజురాబాద్ లో ఉప ఎన్నికపై అధికార పార్టీ టీఆర్ఎస్, ఈటల రాజేందర్ దృష్టి సారించారు. కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతోందని స్పష్టం చేశారు. మాకు నిర్బంధం కొత్త కాదని ఈటల పేర్కొన్నారు.
నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే తన ఎజెండా అని ఈటల తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి ఆమోదించారు. దీంతో ఈటల రాజీనామా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. హుజురాబాద్ లో పోరాటమే శరణ్యంగా ఉందన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు కదలాలని నిర్ణయించుకున్నారు. ఇరు వర్గాలు గెలుపు కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
హుజురాబాద్ పోరు మరో దుబ్బాకలా ఉంటుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. తాడోపేడో తేల్చుకునేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సానుభూతి ఓ పక్క, సమరమే మరో పక్క ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.