కృష్ణా జలాలపై పోరుకు బండి సంజయ్ కసరత్తు

తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబడ్డప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఈ అన్యాయం అదేవిధంగా కొనసాగిందని విచారం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 5:34 pm
Follow us on


తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబడ్డప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఈ అన్యాయం అదేవిధంగా కొనసాగిందని విచారం వ్యక్తం చేశారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి నికర మరియు వరద జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, అదేవిధంగా తెలంగాణ సీఎం, ఏపీ సీఎంతో చేసుకున్న రహస్య ఒప్పందం, వైఫల్యాలపై ఉద్యమించటం కోసం కృష్ణా నదీ జలాల పోరాట కమిటీ ఏర్పాటు చేస్తామని సంజయ్ ప్రకటించారు.

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదని విమర్శించారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మన వాటా మనకు వచ్చే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందిని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ సర్కార్ గత ఆరేళ్లుగా ఈ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు సరిగా వినిపించలేదని మండిపడ్డారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా 811 టీఎంసీలలో మన వాటాను పెంచుకునేందుకు ఉన్న చక్కటి అవకాశాన్ని కూడా కేసీఆర్ వినియోగించుకోలేకపోయారని సంజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా గత నెల 5వ తేదీన ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ మరియు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలు పెట్టడానికి జీవో జారీ చేసినప్పుడు కేసీఆర్ గట్టిగా స్పందించలేదని పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టులు మన తెలంగాణకు కేటాయించబడిన నికర జలాలు వాడుకునే పరిస్థితి కల్పించబడిందని చెబుతూ దక్షిణ తెలంగాణ జిల్లాలైన పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి తలెత్తిందని హెచ్చరించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలకు చెందిన నీటిని కాపాడుకునేందుకు బిజెపియే ముందుగా పోరాటం చేసిందని గుర్తు చేశారు.

కేసీఆర్ ఈ విషయంలో నామమాత్రంగానే కృష్ణా బోర్డుకు లేఖ వ్రాసి ఉరుకున్నారని దుయ్యబట్టారు. బిజెపి పోరాటానికి స్పందించిన కేంద్రం ఈరోజు కృష్ణా-గోదావరి బోర్డు సమావేశం నిర్వహించాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై బిజెపి పోరు కొనసాగుతుందని ప్రకటించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సమగ్రంగా చర్చించి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి’ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతామని తెలిపారు.