Assembly Survey: అసెంబ్లీ సర్వే.. ఐదు రాష్ట్రాల ఫలితాలు… బీజేపీ ఖాతాలో రెండే!

ప్రస్తుత పరిస్థితిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని న్యూస్‌ ఎరీనా ఇండియా అంచనా వేసింది.

Written By: Raj Shekar, Updated On : October 3, 2023 6:59 pm

Assembly Survey

Follow us on

Assembly Survey: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు మంగళవారం వచ్చింది. ఈ పర్యటన తర్వాత తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ దూకుడు మీద ఉండగా, మధ్యప్రదేశ్, బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రీపోల్‌ సర్వే రిపోర్టులు విడుదలవుతున్నాయి. తాజాగా న్యూస్‌ ఎరీనా ఇండియా సంస్థ తన సర్వే ఫలితాలను ప్రకటించింది.

బీజేపీ ఖాతాలో ఆ రెండు రాష్ట్రాలు..
ప్రస్తుత పరిస్థితిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని న్యూస్‌ ఎరీనా ఇండియా అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 125 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌ 99 స్థానాల్లో గెలుస్తుందని, ఇతరులు 6 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. ఇక రాజస్థాన్‌లో కూడా బీజేపీ గెలుస్తుందని న్యూస్‌ ఎరీనా ఇండియా తెలిపింది. ఇక్కడ బీజేపీ 105 సీట్లు, కాంగ్రెస్‌ 70 స్థానాలు, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. 14 స్థానాల్లో ఫలితాలను అంచనా వేయలేదు.

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌..
న్యూస్‌ ఎరీనా ఇండియా సర్వే ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ విజయ ఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 80 స్థానాలు గెలుస్తుందని ప్రకటించింది. కాంగ్రెస్‌ 18 స్థానాలు గెలుస్తుందని, బీజేపీ 9 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది.

ఛతీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌..
ఇక ఛత్తీస్‌గఢ్‌లో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తాజా సర్వే తేల్చింది. 51 స్థానాలు కాంగ్రెస్‌ గెలుస్తుందని, బీజేపీ 33 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుస్తారని ప్రకటించింది.

మిజోరాంలో ఎంఎన్‌ఎం..
ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ఎంఎన్‌ఎం 22 స్థానాలతో అధికారం దక్కించుకుంటుందని న్యూస్‌ ఎరీనా సర్వే తేల్చింది. కాంగ్రెస్‌ 5 సీట్లు, జెడ్‌పీఎం 10 స్థానాలు బీజేపీ 0 స్థానాలు గెలుస్తుందని ప్రకటించింది.