అందరి ఫోకస్‌ బెంగాల్‌పైనే.. కొనసాగుతున్న పోలింగ్‌

పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో శనివారం ఉదయం మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలు, అసోంలో 47 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొదటి విడత 30 స్థానాల నుంచి 191 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 21 మంది మహిళా అభ్యర్థులున్నారు. బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 […]

Written By: Srinivas, Updated On : March 27, 2021 1:08 pm
Follow us on


పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో శనివారం ఉదయం మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలు, అసోంలో 47 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొదటి విడత 30 స్థానాల నుంచి 191 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 21 మంది మహిళా అభ్యర్థులున్నారు. బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌శారు. 73,80,942 మంది ఓటర్లు ఓటు వేయ‌ను‌న్నారు. అసోంలో 1,917 పోలింగ్‌ కేంద్రాల్లో 11,537 పోలింగ్‌ బూత్‌‌లను ఏర్పాటు చేశారు.

మొదటివిడత పోలింగ్‌లో భాగంగా పురూలియా, జరగ్రాం, బంకురా, పుర్బా మిడినీపూర్, పశ్చిమ మిడ్నాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగుతోంది. అసోం రాష్ట్రంలో 47 సీట్లలో 264 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పశ్చిమబెంగాల్ మొదటివిడత పోలింగ్ పర్వంలోనే బంకురా జిల్లా జాయ్ పురా తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం ముందు సంభవించిన పేలుడు ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. తొలి విడతలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 1,307 పోలింగ్‌ బూత్‌లన్నింటినీ నక్సల్స్‌ ప్రభావిత ప్రకటించగా.. 144 కేంద్ర బలగాల జార్‌గ్రామ్‌లో అధికారులు మోహరిస్తున్నారు. బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 74 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

కాగా.. అసోంలో మొదటి విడ‌తలో పోటీ‌ప‌డు‌తున్న అభ్యర్థులు ఎక్కు‌వగా ప్రము‌ఖులే ఉన్నారు. సీఎం సర్బా‌నంద్‌ సోనో‌వాల్‌, అసెంబ్లీ స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రిపు‌న్‌‌బోరా, పలు‌వురు మంత్రులు మొదటి దశలో తల‌ప‌డు‌తు‌న్నారు. రాష్ట్ర అసెం‌బ్లీలో మొత్తం 126 సీట్లుం‌డగా మూడు దశల్లో ఎన్ని‌కలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో పోలింగ్‌ జరు‌గు‌తున్న 47 స్థానాల్లో 23 మంది మహి‌ళలు సహా మొత్తం 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్ని‌కల్లో అధి‌కార బీజే‌పీ–‌అస్సాం గణ‌ప‌రి‌షత్‌, కాంగ్రెస్‌ నేతృ‌త్వం‌లోని మహా‌కూ‌టమి, కొత్తగా ఏర్పా‌టైన అసోం జతియా పరి‌షత్‌ (ఏ‌జేపీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫలితాలు 2 మే 2021న వెలువడుతాయి. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు.