రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడం ఆందోళనకరమని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఏర్పాటు చేశారు, కానీ ఈ సందర్భంగా పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ప్రజలను కొట్టవద్దని డీజీపీ ఆదేశించారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వనపర్తి ఘటనలో సస్పెన్షన్తో పాటు ఇంకా ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
అదేవిధంగా పెద్దసంఖ్యలో ఉన్న హాట్ స్పాట్లలో ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దాఖలైన వివిధ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది.. టెస్టింగ్ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని సూచించింది.
అతిగా ప్రవర్తించిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో.. హాట్ స్పాట్లలో ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారో అనే దానిపై సమగ్ర నివేదిక ఈ నెల 24లోపు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.