పట్టణ ప్రాంతాలలోని వలసదారుల దుస్థితి గురించి ఆలోచించకుండా అర్ధాంతరంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ప్రకటించడంతో, వారి సమస్యతో ఏపీలో జగన్ ప్రభుత్వం సతమతమవుతున్నది. ఆరు రోజుల వరకు వీరి గురించి పట్టించుకోనని కేంద్రం అకస్మాత్తుగా లక్షలాది మంది వలస ప్రజలు గ్రామాలకు తరలి వెళ్లడం గమనించి ఖంగారు పడింది.
వారంతా గ్రామాలకు చేసి, కరోనా వైరస్ ను అక్కడకు చేరిస్తే, దానిని కట్టడి చేయడం దాదాపు అసంభవమని భయపడింది. దానితో జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేసి, వలస ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పైగా, వారికి వసతి శిబిరాలు ఏర్పాటు చేసి, భోజన ఏర్పాటు కూడా చేయమని సూచించింది.
అందుకోసం ఒక రూపాయి నిధిని కూడా అందించకుండా, జాతీయ విపత్తు స్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్) నిధులను వాడుకోమని సలహా ఇచ్చింది. అయితే ఈ నిధుల వాడకంకు సంబంధించి ప్రస్తుతం 25 శాతంకు మించి ఖర్చు చేయరాదని గతంలో కేంద్రం రూపొందించిన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. 2015లో రూపొందించిన నిబంధనల ప్రకారం పెద్దవారికి రూ 60, పిల్లలక్లు రూ 45 చొప్పున మాత్రమే రోజుకు ఖర్చు చేయవలసి ఉంటుంది.
ఈ మొత్తాన్ని భోజనం, వసతి, నీరు …. వంటి అన్ని ఖర్చులకు ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుత ధరలకు వీటిని ఏ విధంగా సరిపెట్టాలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ప్రశ్నార్ధకరంగా మారింది. ఐదు సంవత్సరాల క్రితం ధరలతో ఇప్పుడు తాత్కాలిక వసతి కల్పించమనడంపై అధికారుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ, దాతల భవనాలు అదుబాటులో లేని చోట్ల తాత్కాలిక షెల్టర్ల నిర్వహణకు అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రస్తావన 2015లో ఇచ్చిన జీవోలో లేదు. ఆ జీవోలో ప్రధానంగా కరువు, తుపాన్లు, వరదలు, భూకంపాలు, శీతల గాలులు, పెస్ట్ అటాక్ వంటి వాటినుద్దేశించి చెప్పారు. కరోనా అందుకు పూర్తి భిన్నం. ఆ జీవోలోనే దుస్తులకు ప్రతి కుటుంబానికి రూ.1,800 ఇవ్వాలని ఉంది. ఇప్పుడు అమలు చేస్తారో లేదో తెలీదు.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2019-20కి గాను కేంద్రం రాష్ట్రానికి తన వాటా (90 శాతం) కింద రూ.420 కోట్లు కేటాయించింది. దానికి రాష్ట్రం తన వాటా రూ.42 కోట్లు (పది శాతం) కలిపి ఖర్చు చేయాలి. కరువు, వరదల వంటి వరుస విపత్తుల వలన కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ రాష్ట్రం అడ్వాన్స్లు తీసుకుంటోంది.
15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2020-21లో రాష్ట్రానికి ఎస్డిఆర్ఎఫ్ కింద రూ.510 కోట్లు కేంద్రం ఇవ్వాలి. ఎప్పుడిస్తుందో తెలీదు. ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఆర్డినెన్స్ రూపంలో మూడు మాసాలకే ఆమోదమైంది.
అసలకే తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కు లాక్ డౌన్ కారణంగా సాధారణంగా వచ్చే ఆదాయంకు సహితం గండి పడే అవకాశం ఉండడంతో వలస ప్రజలను ఆదుకోవడం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండే. పైగా, హైదరాబాద్ లో ఉంటున్న వారిని చెప్పా పెట్ట కుండా హైదరాబాద్ పోలీసులు ఏపీ సరిహద్దులకు పంపి వేయడంతో, వారందరి వసతి, భోజనం కూడా చూడవలసిన అవసరం ఏర్పడింది.