
లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు. డిజిటల్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్ర మంత్రి సూచించినట్టు సమాచారం.
లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మే 3వ తేదీన రెండవ విడత లాక్ డౌన్ గడువు ముగియడంతో అనంతరం రెండు వారాల వ్యవధితో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.