రాష్ర్టంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. యూపీఎస్సీ నిర్వహించి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పినా అది ఆచరణలో కనిపించడం లేదు. రెండేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తుతున్నారు. జగన్ ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెబుతున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు అవుతోంది.
జగన్ ప్రభుత్వం జూన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అందులో వివరాలేవి స్పష్టంగా లేవు. జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు. ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే వివరాలు తెలపాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ వివరాలేవి ప్రకటించకుండా జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని మాత్రమే చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1,2 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నా ఆ ధిశగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఆగస్టు నెల పూర్తయినా కూడా జాబ్ క్యాలెండర్ రాకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో అవి ఎప్పుడు వస్తాయోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగుల ఆశలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుస్తోంది.