కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు వారం పాటు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సామాజిక దూరం పాటించడంలో భాగంగా 50-50 చొప్పున ఉద్యోగులు ఆల్టర్నేటీవ్ వారాలు విధుల నిర్వహణకు రావాలని సూచించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ మొదలుకొని కిందిస్థాయి వరకు ఆల్టర్నేట్ వారాలు పనిచేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉద్యోగులను 50-50 శాతంగా విభజించాలని ఆదేశించారు.
జిల్లాలో హెచ్ఓడీలు, జిల్లా ఆఫీసులు, ఆ కింది ఆఫీసులలో ఉద్యోగులను సైతం 2 సమాన గ్రూపులుగా చేసి ఆల్టర్నేట్ వారాలు పనిచేయించాలని ఆదేశాల్లో ఆమె పేర్కొన్నారు.
రిటైర్ అయి ప్రభుత్వ సలహాదారులుగా, చైర్పర్సన్లుగా, కాన్సల్టెంట్లుగా పనిచేస్తున్న వారు హెచ్ఓడీల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం కల్పించారు.
50 సంవత్సరాలకు పైబడి మధుమేహం, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని ఉత్తర్వుల్లో ఆమె స్పష్టం చేశారు. ఇలాంటివారికి ఏప్రిల్ 4 వరకు మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేకుండా కమిటెడ్ లీవ్ జారీ చేస్తామని తెలిపారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో ఆఫీసుకు వచ్చేలా అవకాశం కల్పించారు. ఇలా 50 శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి మిగతా 50శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా వీక్లీ రోస్టర్ తయారు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.