రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత పదవి మంత్రి. సీఎం సీటును పక్కనపెడితే.. రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం మంత్రి సీటే. మరి అలాంటప్పుడు.. మంత్రి అని పిలిపించుకోవాలని ఏ నేతకు మాత్రం ఉండదు? అయితే.. ఈ పదవి కోరుకునేవారు రెండు రకాలుగా ఉంటారు. సీఎం ఇస్తే తీసుకుందాం అనుకునేవారు ఒకరకమైతే.. ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేసేవారు మరో రకం. ఇప్పుడు ఏపీలో ఈ రెండో జాబితా అమాంతం పెరిగిపోయింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిమంత్రి వర్గవిస్తరణ సమయంలోనే జగన్ ఓ హామీ ఇచ్చారు. అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదుకాబట్టి.. విడతల వారీగా పంపకాలు చేపడతానని చెప్పారు. ఆ లెక్క ప్రకారం.. ప్రస్తుత మంత్రులు రెండున్నరేళ్లే ఉంటారని క్లియర్ గా చెప్పారు. ఆ సమయం రాబోతోంది. దీంతో.. మిగిలిన వారంతా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
అన్నీ కుదిరితే రాబోయే నవంబర్, డిసెంబర్ లో మంత్రి వర్గ విస్తరణ ఉండబోతోందని సమాచారం. ముఖ్యమంత్రి హామీ ప్రకారం.. మంత్రివర్గ ప్రక్షాళన అనేది జరిగితే దాదాపు తొంభై శాతం మందిని పక్కన పెట్టాల్సిందే. కానీ.. ఎంత కాదనుకున్నా సమీకరణలు ఖచ్చితంగా లెక్కలోకి వస్తాయి. కొందరిని ఇష్టం లేకున్నా పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. కొందరికి ఇవ్వాలని అనిపించినా.. ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. మరి, ఈ లెక్కన ఇప్పటి ఉన్నవారిలో పదవులు కాపాడుకునేది ఎవరు? ఆశపడుతున్న వారిలో దక్కించుకునేవారు ఎవరు? అనే చర్చ తీవ్రస్థాయిలో సాగుతోంది.
ఈ ఛాన్స్ మిస్సయితే.. మళ్లీ ఎన్నికలే కాబట్టి.. ఏం చేసైనా పదవి సాధించాలని పట్టుబట్టే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఒక వేళ తమకు పదవి ఇవ్వకపోతే పార్టీని వదిలి వెళ్తామని, చంద్రబాబుతో ఇప్పటికే టచ్ లో ఉన్నామని ఫీలర్లు కూడా వదులుతున్నారట. దీంతో.. జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? కలిగే నష్టం ఎంత? అని లెక్కలు వేసుకుంటున్నారట. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు పార్టీ నేతల నుంచీ రిపోర్టు తెప్పించుకుని పరిశీలిస్తున్నారట.
ఈ సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ ఉన్న వారిలో.. బొత్స సత్యానారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు, మేకపాటి గౌతమ్ రెడ్డి, పుష్ప శ్రీవాణి, అనిల్ యాదవ్, అవంతి శ్రీనివాస్, సుచరిత, కన్నబాబు సేఫ్ అని తెలుస్తోంది. ఇక, కొత్తగా వచ్చే వారిలో.. అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్, ఆనం రామనారాయణరెడ్డి, కళావతి, ఉషశ్రీ చరణ్, తలారి వెంకట్రావు, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ తమ్మినేని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కాకాని గోవర్ధన్ రెడ్డి, రోజా, తోట త్రిమూర్తులు, జోగి రమేష్, పార్థసారధి వంటి వారు కూడా రేసులో ఉన్నారు. మరి, జగన్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు? ఫైనల్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.