KCR- National Politics: చిలక ఏ తోడు లేక.. ఎటేపమ్మ ఒంటరి నడక.. అన్నట్లు ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రయాణం. జాతీయ రాజకీయాలుచేస్తానంటూ.. దేశం చుట్టేసిన నాయకుడు.. ఇప్పుడు ఒంటరి అవుతున్నారు. మోడీతో కయ్యానికి కాలుదువ్వినా ఆయనకు కలిసి వచ్చిన పరిణామాలు కానీ, పరిస్థితులుకానీ కనిపించడం లేదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా కేసీఆర్కు కనీసం మద్దతు ఇవ్వడం లేదు. దక్షిణాదిలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ నుంచి మాత్రమే ఆయనకు మొదట మద్దతు లభించింది. ఇప్పుడు అది కూడా లభించే అవకాశం కనిపించడం లేదు.

హ్యాండిచిన బీజేపీ వ్యతిరేక పార్టీలు..
మరోవైపు.. కేంద్రంలోని బీజేపీని నిన్న మొన్నటి వరకు విభేదించిన వారు తనను కలుపుకొని పోతారని, తను గీసిన గీత దాటరని కేసీఆర్ భావించారు. కానీ ఇప్పుడు వారంతా హ్యాండిచ్చే పరిస్థితి నెలకొంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలి¯Œ కానీ కేసీఆర్తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. వీరిలో చాలా మంది మోదీకి విధేయులుగా మారిపోయారు. కారణాలు ఏవైనా కావొచ్చు.. పరిస్థితి ఏదైనా రావొచ్చు.. నాయకులు మాత్రం మోదీపై విధేయత ప్రదర్శిస్తున్నారు.
పట్టించుకోని నితీశ్
ఈ పరిణామాలకు తోడు.. బీహార్లో నిన్నటి వరకు మోదీని విమర్శించిన సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ నాయకులు.. కూడా ఇప్పుడు మోడీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా అంతర్గత కారణాలు చాలానే ఉన్నాయి. ఇక, కశ్మీర్ విషయంలో మోదీ వైఖరిని తప్పుబట్టిన వారు కూడా ఇప్పుడు ఆయన బాటలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. నేరుగా వారు మోదీని ప్రస్తుతించకపోయినా.. తిట్టే సాహసం అయితే చేయలేక పోతున్నారు. ఇక, పొరుగున ఉన్న ఒడిశా సీఎం పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన విభేదించరు.. సానుకూలంగానూ ఉండరు.

కలిసి వచ్చే నాయకుడేరి?
మొత్తానికిఈ పరిణామాలను గమనిస్తే.. కేసీఆర్తో కలిసి వచ్చే నాయకులు.. ఎవరు? వస్తామని చెప్పిన నాయకుల్లో మిగిలేది ఎవరు? అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదికి వస్తున్నాయి. మరో 18 నెలల్లో.. దేశంలో సార్వత్రిక సమరం ప్రారంభం కానుంది. ఆ సమయానికి 28 రాష్ట్రాల్లో ఎన్నిచోట్ల బీఆర్ఎస్ దూకుడు చూపిస్తుందా? ఎంతమందిని కలుపుకొనిపోతుంది? అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే.. కేసీఆర్ దూకుడుకు తెలంగాణ సరిహద్దుల్లోనే బంధనాలు వేసేలా జాతీయస్తాయిలో బీజేపీ నెరుపుతున్న రాజకీయ వ్యూహాలకు అడ్డుకట్ట వేయడంలోనే సమయ గడిచిపోయే పరిస్థితి నెలకొందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా కేసీఆర్ పరిస్థితి జాతీయస్థాయిలో కొడికడుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రంలో మోదీని గద్దె దించాలని.. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలన్న లక్ష్యం ఈ ఒంటరి పయనంతో ఎలాసాధ్యమని గులాబీ నేతలే గుసగుసలాడుతున్నారు.