తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య స్నేహ బంధం ఉందని గతంలో ఎన్నో సంఘటనలు నిరూపించాయి. అయితే.. జల జగడం తర్వాత చాలా మందికి సందేహం వచ్చింది. వీరిద్దరి దోస్తానా చెడిందా? అనే చర్చ జరిగింది. అయితే.. విపక్షాలతోపాటు పలువురు జనం మాత్రం వారిది ఉత్తుత్తి పంచాయితీనే అని, ఇద్దరి మధ్యా బలమైన స్నేహం అలాగే ఉందని చెప్పారు. అయితే.. ఇది నిజమే అన్నట్టుగా ఆ మధ్య ఓ విషయం రుజువు చేసింది. తాజాగా.. మరో విషయం కూడా కన్ఫామ్ చేసిందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న దశరథ రామిరెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఏపీ సర్కారు చేసిన అభ్యర్థనను తెలంగాణ మన్నించింది. అంతర్ రాష్ట్ర డిప్యుటేషన్ విధానాన్ని ఉపయోగించి మరీ.. ఆయనకు బాధ్యతలు అప్పగించడం రెండు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది.
అయితే.. ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సారి కోరిక కోరడం తెలంగాణ సర్కారు వంతైంది. ఆంధ్రప్రదేశ్ ఇటీవల రూపొందించిన ‘నాడు – నేడు’ సాఫ్ట్ వేర్ కావాలని అడిగింది తెలంగాణ ప్రభుత్వం. సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ సాఫ్ట్ వేర్ చాలా బాగుందని, తాము కూడా ఉపయోగించుకుంటామని కోరడంతో.. ఏపీ వెంటనే ఓకే చెప్పేసింది. దీంతో.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సత్సంబంధాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అటు ఓఎస్డీ అంశం.. ఇటు సాఫ్ట్ వేర్ విషయంతో.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని తేలిపోయిందని అంటున్నారు రెండు రాష్ట్రాల జనం. మరి, ఇలాంటి విషయాల్లో సహకారాలు అందించుకోవచ్చుగానీ.. నీటి పంచాయితీ విషయంలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడుకోలేదని ప్రశ్నిస్తున్నారు. జనాల మధ్య భావోద్వేగాలు రెచ్చకొట్టడానికి నీటి పంచాయితీని వాడుకున్నారా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా.. రాజకీయ డ్రామా కాక మరేమిటని నిలదీస్తున్నారు. మరి, దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటారో?