Homeజాతీయ వార్తలుY. S. Sharmila: జైలుకు పంపే వరకూ షర్మిలను వదిలేదే లే

Y. S. Sharmila: జైలుకు పంపే వరకూ షర్మిలను వదిలేదే లే

Y. S. Sharmila: చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పాము, కర్ర ఫార్ములానే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. చిన్న పార్టీలను అని లైట్‌ తీసుకుంటే.. ఏకుమేకై కూర్చునే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో విపక్షాలు చిన్నవా పెద్దవా అని ఆలోచన చేయకుండా తన వ్యతిరేక పార్టీలను అణచివేస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలపై మరో కేసు పెట్టింది.

కేసీఆర్‌ను దూషించారని…
షర్మిలపై వివిధ సందర్భాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చివరిగా లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచి బయటికి వెళుతున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులపై చేయి చేసుకున్నారనే కారణంతో కేసు నమోదైంది. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్‌ సర్కార్‌పై మీడియా సమావేశాల్లోనూ, సోషల్‌ మీడియాలోనూ దూషణలకు దిగారంటూ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్‌పై షర్మిల దూషణలకు దిగారని బంజారాహిల్స్‌ పోలీసులకు బీఆర్‌ఎస్‌ నేత నరేందర్‌యాదవ్‌ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆమెపై అక్కడి పోలీసులు 505(2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం.

షర్మిల కట్టడికి చర్యలు..
షర్మిలను కేసీఆర్‌ సర్కార్‌ ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. పాదయాత్రలో బీఆర్‌ఎస్‌ నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటోందంటూ అనుమతి రద్దు చేశారు. న్యాయపోరాటం చేసి అనుమతి తెచ్చుకున్నప్పటికీ అడుగులు ముందుకు వేయలేని దుస్థితి. నోరు తెరిస్తే, అడుగేస్తే కేసులన్నట్టుగా షర్మిల పరిస్థితి తయారైంది. మరోవైపు కేసీఆర్‌ ప్రభుత్వానికి టార్గెట్‌ అయినప్పటికీ, ప్రజల్లో షర్మిల పార్టీకి తగిన ఆదరణ లేదు. షర్మిలను ఆంధ్రా నాయకురాలిగానే అక్కడి పౌర సమాజం చూస్తుందనేందుకు, వైఎస్సార్‌టీపీ బలపడకపోవడమే నిదర్శనం.

మీడియాలో ఉండాలని..
మరోవైపు మీడియాలో నిత్యం ఉండాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే వెనకా ముందు ఆలోచించకుండా ప్రభుత్వంతోపాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. దూషిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో షర్మిలను ఎంత కట్టడి చేస్తే అంత మంచిది అన్న ఆలోచనలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఉంది. దీంతో ఎక్కడ దొరికితే అక్కడ పార్టీ నేతలతో కేసులు పెట్టిస్తోంది. జైలుకు పంపే వరకూ వదిలే పరిస్థితి కనిపించడం లేదు.

కేసులతోనే షర్మిలకు పుణ్యకాలం సరిపోతోంది. ఇక ఆమె రాజకీయాలు ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడానికే షర్మిలకు సరిపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుసుకునేందుకు అనుకూల వాతావరణం లేదనే చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular