భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసిపి అదికార ప్రతినిది, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారని, ఆ సమయంలో కన్నా ముఖ్యమంత్రి పదవిలోకి రావాలని డిల్లీలో కాంగ్రెస్ నేత ఒకరికి ఇరవై కోట్లు ముట్టచెప్పారని ఆయన ఆరోపించారు. అయితే ఆ తర్వాత కన్నాకు ఆ నేత టోపి పెట్టారని అన్నారు. ఈ విషయమై కన్నా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాదని నమ్మిన వారిని నట్టేట ముంచే చరిత్ర కన్నాకు ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఇచ్చిన డబ్బుకు పార్టీకి లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. ఈ అంశంపై అదిష్టానం ఆగ్రహంతో ఉందన్నారు. ఆ సంగతి తెలిసి కన్నా ఈ రకంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి కన్నా సిద్దం అయి, ఆ తర్వాత గుండెపోటు వచ్చిందని ఆస్పత్రిలోకి చేరానని, నిజంగా గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు అమ్ముడు పోలేదని ప్రమాణం చేయగలరా అని కన్నా ప్రశ్నించారని, ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి తాను సిద్దంగా ఉన్నారని రాంబాబు తెలిపారు.