Homeజాతీయ వార్తలుRevanth Reddy : ఆరునెలల్లో ఎంత మార్పు.. నాడు అడ్డుకున్నారు.. నేడు సెల్యూట్‌ చేసి స్వాగతించారు

Revanth Reddy : ఆరునెలల్లో ఎంత మార్పు.. నాడు అడ్డుకున్నారు.. నేడు సెల్యూట్‌ చేసి స్వాగతించారు

Revanth Reddy : ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే సామెత తెలంగాణ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విషయంలో నిజమైంది. పాత సచివాలయం తనకు అచ్చిరాదని, సచివాలయానికి వెళ్లకుండా దాదాపు 9 ఏళ్లు పాలన సాగించిన కేసీఆర్‌, సుమారు రూ.600 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం నిర్మించారు. పాత సచివాలయం బాగానే ఉన్నా.. దానిని తొలగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న కొత్త సచివాలయం ప్రారంభించారు. దానికి డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంగా నామకరణం చేశారు. ఈ క్రమంలో మే 1వ తేదీన పలు సమస్యలను మునిసిపల్‌ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు విన్నవించేందుకు మల్కాజ్‌గిరి ఎంపీగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కొత్త సచివాలయానికి వెళ్లారు. కానీ, కేసీఆర్‌ సర్కార్‌ రేవంత్‌రెడ్డిని కొత్త సచివాలయంలోకి అనుమతించలేదు. పోలీసులను అడ్డు పెట్టుకుని రేవంత్‌రెడ్డి రాకుండా ఆపింది. అనుమతి లేకుండా వచ్చారని పోలీసులు రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

కిలోమీటర్‌ దూరంలోనే అడ్డగింత..
ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ వసూళ్లను 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన అంశంపై అధికారిక సమాచారం కోసం మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటానంటూ రేవంత్‌రెడ్డి సచివాలయానికి బయలు దేరారు. నూతన సచివాలయం విషయానికి రేవంత్‌ వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అనుమతి లేదంటూ పోలీసులు ఏకంగా కిలోమీటర్‌ దూరంలోని టెలిఫోన్‌ భవన్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రేవంత్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన అంశంలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తాను మునిసిపల్‌, హెచ్‌ఎండీఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేసేందుకు వెళుతున్నానని పోలీసులతో రేవంత్‌ చెప్పారు. ఒక ఎంపీ అయిన తనకు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తాను ఒక్కడినే వెళ్లి అధికారులను కలుస్తానని, అవసరమైతే పోలీసు వాహనంలోనే తీసుకెళ్లి తీసుకురావాలని కోరారు. అయినా పోలీసులు అంగీకరించలేదు.

నేడు సెలూ‍్యట్‌ చేసి స్వాగతం పలికి..
ఆరు నెలల క్రితం సచివాలయానికి రాకుండా అడ్డుకున్న పోలీసులే నేడు రేవంత్‌రెడ్డికి సెల్యూ్‌ చేసి స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. రేవంత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం 1:21 నిమిషాలకు రేవంత్‌ సీఎంగా ప్రమాణం చేశారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సాయంత్రం సీఎం హోదాలో సొంత కారులోనే రేవంత్‌రెడ్డి సాయంత్రం సచివాలయానికి వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్‌లోకి రేవంత్ అడుగుపెట్టారు.

బాధ్యతల స్వీకరణ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయం మొదటి గేటు నుంచి ప్రధాన భవనం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సచివాలయం మొత్తం ఆయన కలియతిరిగారు. అనంతరం ఆరో అంతస్తులోని తన క్యాబిన్‌లోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజలు చేశారు. రేవంత్‌ను ఆశీర్వదించారు.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version