Homeజాతీయ వార్తలుప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు.. కేసీఆర్ ను వదలడం లేదే?

ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు.. కేసీఆర్ ను వదలడం లేదే?

తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో బ్లాస్టింగ్ జరగడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పాలమూరు రంగారెడ్డి ఫస్ట్‌ పంప్‌ హౌస్‌తోపాటు అప్రోచ్‌ చానల్‌ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్లతోనే ఈ ప్రమాదం జరిగింది. కల్వకుర్తి పంప్‌హౌస్‌లో డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీట మునిగాయి. మూడో మోటారు దెబ్బతిని దాని నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. పాలమూరు ప్రాజెక్టులో అండర్‌‌ గ్రౌండ్‌ పంప్‌హౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంప్‌హౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌‌ ఇంజనీర్లు హెచ్చరించినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో ఇప్పడీ పరిస్థితి తలెత్తింది.

Also Read: దుబ్బాక ప్రచారంలో బీజేపీ ముందుందా..? టీఆర్‌ఎస్‌కు హరీశ్ యేనా?

ఇటీవల శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌‌ హౌస్‌లో అగ్ని ప్రమాదంతో హైడల్‌ పవర్‌‌ జనరేషన్‌ పూర్తిగా నిలిచిపోయింది. పవర్‌‌ స్టేషన్‌లో రిపేర్లు పూర్తిచేశామని, త్వరలోనే కరెంటు ఉత్పత్తి మొదలవుతుందని జెన్‌కో ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ.. అది ఇంకా వినియోగంలోకి రానే లేదు. అప్పుడే శ్రీశైలంపైనే ఆధారపడి నిర్మించిన కల్వకుర్తి పంప్‌హౌస్‌ నీట మునగడంతో ఈ యేడు శ్రీశైలం నుంచి చుక్క నీటిని కూడా వినియోగించే పరిస్థితి లేదు.

దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం మొదలైంది. ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణలను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మునిగిపోయిన ప్రాజెక్ట్‌ను చూస్తే తప్పేమిటని మరోవైపు విపక్ష నేతలూ ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎల్లూరు వద్ద ఉంది. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం నిర్మిస్తోంది. ఈ పథకంలో భాగంగా పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ ఎల్లూరు ఎత్తిపోతలకు సమీపంలోనే నిర్మిస్తున్నారు.

కేవలం కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడానికే.. ప్రత్యేకంగా తప్పుడు నివేదికలు తప్పించి మరీ ప్రాజెక్ట్ బ్లాస్టింగ్ చేయించారని రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతోఇప్పుడు కాంట్రాక్టర్ అంశం కూడా హైలెట్ అవుతోంది. ఈ విషయాన్ని వీలైనంతగా లోప్రోపైల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Also Read: జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి ఎందుకు పోవడం లేదు..?

నీట మునిగిన ఎత్తిపోతలను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయడం సాధ్యం కాని పని. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గితే కానీ నీటిని తొలగించి మోటార్లు బయటికి తీయలేరు. అందుకే.. ఇదంతా కుట్రపూరితమని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా.. ఆ పంప్ హౌస్‌ను పరిశీలించడానికి వెళ్లారు. వారిని అక్కడి వరకూ వెళ్లనీయలేదు. గతంలో శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా రాజకీయ దుమారమే రేగింది.తాజాగా.. మరో ప్రాజెక్టులోనూ ప్రమాదం జరగడం..ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై వీలైనంతగా లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేయడానికి ప్రభుత్వం అరెస్టులతో ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న వాటిలో ఒకటి తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతుండడంపై అటు ప్రభుత్వాన్నీ హైరానాలో పడేశారు. ఇటు ప్రతిపక్షాల ఎదురుదాడి మొదలైంది. మున్ముందు ఎలక్షన్లూ రాబోతున్నాయి. మరి వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version