Kashmir Polling: మార్పు మొదలైంది.. కశ్మీర్‌ లో ఓటు వేయడానికి భారీగా ప్రజల రాక.. పోలింగ్‌ ఎలా సాగుతోందంటే?

భూతల స్వర్గం కశ్మీర్‌ అంటారు. పర్యాటకులకు స్వర్గధామం అయిన కశ్మీర్‌లో దాయాది దేశం కారణంగా ఉగ్రదాడులు పెరిగాయి. ఆర్టికల్‌ 370 కారణంగా ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. దానిని కేంద్రం నాలుగేళ్ల క్రితం రద్దు చేసింది.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 11:09 am

Kashmir Polling

Follow us on

Kashmir Polling: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేందకు దేశ విభజన సమయంలో కల్పించిన ఆర్టికల్‌ 370.. ఆ రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ కల్పించింది. భారత దేశంలో భాగమే అయినా.. భారత రాజ్యాంగం అక్కడ అమలు కాలేదు. ప్రత్యేక దేశం అన్న భావనతో కశ్మీరీలు ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆర్టిక్‌ 370ను రద్దు చేయాలని కేంద్రంలోని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకోసం వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది. నాలుగేళ్ల క్రితం ఆర్టికల్‌ 379ను రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో ఆ రాష్ట్రంలో పదేళ్లుగా ఎన్నికలు జరుగలేదు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు జోక్యంతో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈమేరు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. దీంతో పదేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. తొలి విడతలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ బుధవారం(సెప్టెంబర్‌ 18న) జరుగుతుంది.

పదేళ్ల తర్వాత ఎన్నికలు
జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చివరిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. జమ్మూ, కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతోపాటు ఆర్టిక్‌ 370ని రద్దు చేసింది. స్వయం ప్రతిపత్తి రద్దు అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్మూ, కశ్మీర్‌ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి నెలకొంది. తొలి విడతలో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు బుధవారం(సెప్టెంబర్‌ 18న) ఈసీ నిర్వహిస్తోంది. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తొలి విడతలో 23.27 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది.

గెలుపు కోసం అన్ని పార్టీల యత్నం..
పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు నేషలన్‌ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఎవరికి వారు శ్రమించారు. విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేందకు కళ్లు తిరిగే మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఎన్నికల హామీల్లో రాష్ట్ర హోదా కూడా ఇస్తామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కూడా ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చాయి.

భారీ బందోబస్తు..
ఇదిలా ఉంటే.. తొలి విడత పోలింగ్‌ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది మంగళవారం(సెప్టెంబర్‌ 17) సాయంత్రమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తొలి విడత ఎన్నికల్లో 219 మంది పోటీ పడుతున్నారు. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల సంఘం కూడా జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి ఓటు ప్రాధాన్యతను వివరించింది. తొలి విడత ఎన్నికలు జరిగే 24 నియోజకవర్గాల్లో 16 కశ్మీర్‌ వ్యాలీలో ఉండగా, మరో 8 నియోజవర్గాలు జమ్మూలో ఉన్నాయి. ఎన్నికల విధుల్లో సైన్యం కూడా పాల్గొంటోంది.

భారీగా పోలింగ్‌..
ఇదిలా ఉంటే కశ్మీర్‌లో 35 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో నాలుగు నెలల క్రితం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ నమోదైంది. 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాధారణంగా కశ్మీర్‌లో 30 నుంచి 40 శాతం పోలింగ్‌ నమోదవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో 58 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 50 శాతానికిపైగా పోలింగ్‌ నమోదవుతుందని భావిస్తున్నారు. ఉదయం 7 గంటలకు 24 నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 9 గంటల వరకు సగటున 15 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.