Malla Reddy: తొడగొట్టి సవాల్ చేస్తే.. రేవంత్ ఊరుకుంటాడా?

రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ఎంపీగా ఉన్నప్పుడు అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆయన ప్రభుత్వ స్థలంలో తన కళాశాలలకు రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 8:36 am
Follow us on

Malla Reddy: రాజకీయాల్లో సవాళ్లు ఉన్నట్టే ప్రతి సవాళ్ళు కూడా ఉంటాయి. కాకపోతే వాటిని విసిరేముందు ఒకసారి వెనక ముందు చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు మిడిసి పడితే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందిని ఓ రాజకీయ నాయకుడు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడేవారు. పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చా అని, తాను సోషల్ మీడియా స్టార్ అని చెప్పుకునేవాడు. అంతేకాదు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ఒకానొక దశలో తొడ కొట్టి సవాల్ కూడా విసిరారు. కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. కానీ పైన తధాస్తు దేవతలు ఉంటారు కాబట్టి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటిదాకా సవాళ్లు విసిరిన ఆ రాజకీయ నాయకుడు ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లారు. ఇప్పుడేం జరుగుతోందంటే..

రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ఎంపీగా ఉన్నప్పుడు అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆయన ప్రభుత్వ స్థలంలో తన కళాశాలలకు రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను అధికారులకు సమర్పించినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఆ అధికారులు కూడా అధికార పార్టీ మంత్రి కావడంతో వెనుకంజ వేశారు. ఈలోగా కాలం గిర్రున తిరిగింది. మల్లారెడ్డి ఎమ్మెల్యేగా అయితే గెలిచారు కానీ.. ప్రతిపక్ష స్థానానికి పరిమితమైపోయారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై వరుసగా దృష్టి పెట్టుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డి అక్రమాలపై నజర్ పెట్టారు. ఆయన ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి మల్లారెడ్డి తన కళాశాలలోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకున్నారు. అప్పట్లో దీనిపై రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి నిర్మించిన కట్టడాలను తొలగించారు. ఎక్స్ క వేటర్ల సహాయంతో గోడలు, ఇతర నిర్మాణాలను పగలగొట్టారు. ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి అసలు సినిమా చూపిస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేవలం ఈ నిర్మాణం మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమాలను కూల్చాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమ నిర్మాణాల వల్ల వానాకాలంలో హైదరాబాద్ మునుగుతోంది. ఆ వానా కాలం సమీపించే లోగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తే నగరానికి వరద ముప్పు తప్పుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం.