Court Historic Judgment: ఒక చిన్న పొరపాటు.. పోలీసుల నిర్లక్ష్యం ఒక వ్యక్తి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. అతడు తన ప్రయాణంలో పోలీసుల విచారణను ఎదుర్కొని వారి తప్పిదం వల్ల 57 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడంతో పాటు సమాజంలో ఎన్నో అవమానాలు పొందాడు. అయితే 16 ఏళ్ల తరువాత అతడు దీనిపై న్యాయం పొందినా.. తన జీవితంలోని విషాధ రోజులను మాత్రం తిరిగి తీసుకురాలేకపోయాడు. దోషులను శిక్షించకపోయినా.. నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు.. అన్న వాదానికి వ్యతిరేకంగా సాగిన ఈ స్టోరీ వింటే ఎవరినైనా కలిచివేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితె..
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అజయ్ సింగ్ 2010వ సంవత్సరంలో తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి పయనమయ్యాడు. ఇందు కోసం ఆయన భోపాల్ విమానాశ్రయంకు వచ్చాడు. అయితే విమానాశ్రయంలోని భద్రతా తనిఖీల సమయంలో, ఆయన బ్యాగులో ఉన్న తెల్లటి పొడిని చూసి అధికారులు అనుమానించారు. పోలీసులు దాన్ని ‘నార్కోటిక్ డ్రగ్’ అని ప్రాథమికంగా నిర్ధారించి, ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను తీసుకెళ్తున్నది కేవలం మామిడికాయ పొడి (ఆమ్చూర్ పౌడర్) అని, అది వంట కోసం అని అజయ్ పదేపదే మొరపెట్టుకున్నా అధికారులు వినిపించుకోలేదు. ఫలితంగా, ఎటువంటి నేరం చేయకపోయినా ఆయన 57 రోజుల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.అజయ్ సింగ్ తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అప్పట్లో తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు.
ఆ తరువాత ఆ పొడిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. అది డ్రగ్స్ కాదని, సాధారణ మామిడికాయ పొడి అని నివేదికలో స్పష్టమైంది. ఆ నివేదిక తర్వాత అజయ్ జైలు నుంచి విడుదలైనప్పటికీ, సమాజంలో జరిగిన పరువు నష్టం, మానసిక వేదన, కెరీర్లో ఎదురైన ఇబ్బందులు ఆయన్ను వెంటాడాయి. తన గౌరవాన్ని కాపాడుకోవాలని, జరిగిన అన్యాయానికి పరిహారం పొందాలని నిర్ణయించుకున్న ఆయన న్యాయపోరాటం మొదలుపెట్టారు.
దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టును సంప్రదించాడు. సుదీర్ఘంగా 16 ఏళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటం తాజాగా అజయ్ సింగ్కు ఊరటనిచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, పోలీసుల నిర్లక్ష్యం, అపక్వమైన విచారణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒక వ్యక్తిని 57 రోజుల పాటు జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని కోర్టు పేర్కొంది. బాధితుడికి జరిగిన మానసిక క్షోభకు, పరువు నష్టానికి పరిహారంగా రూ. 10 లక్షలను చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఈ తీర్పు వ్యవస్థలో తప్పు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యులకు కల్పిస్తోంది. 16 ఏళ్ల పాటు పోరాడి, చివరకు సత్యమే గెలిచేలా చేసిన అజయ్ సింగ్ ప్రయాణం, చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులకు ఇది ఒక హెచ్చరిక అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్యాయంగా జైలుకు వెళ్లిన వ్యక్తికి దక్కిన ఈ పరిహారం, కోల్పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాకపోయినా, ఆయనకు జరిగిన అన్యాయానికి ఒక గుర్తింపుగా నిలుస్తుంది.
