
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికోసం ముందుండి పోరాడుతున్న వారిలో31 మందికి వైరస్ కు గురయ్యారు. వారిలో కరోనా రోగులకు చికిత్స ఇస్తున్న 12 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నారని ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి వెల్లడించారు.
అలాగే రాజ్ భవన్ లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. దానితో గవర్నర్ దంపతులకు కూడా టెస్ట్ చేశామని, వారికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో కీలకమైన ఒక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అటెండర్ కు కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఆపనిచేస్తున్న ఉద్యోగులు అందరు ఖంగారు పడుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 73 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 31 మరణించారు. ప్రస్తుతం 1014మంది చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువగా 29 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.
దానితో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 283 కాగా, కర్నూల్లో 343, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, పశ్చిమగోదావరి 56, అనంతపురం 58, తూర్పుగోదావరి 40, విశాఖ 23, శ్రీకాకుళం జిల్లాలో 05 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్త కేసులన్నీ కంటైన్మెంట్ జోన్ల నుంచే వస్తుండటం గమనార్హం.
‘ప్రతి పదిలక్షల మందికిగానూ 1504 పరీక్షలు చేస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నాం. పాజిటివ్ కేసులు దేశంలో సగటున 4.13 శాతం ఉంటే, రాష్ట్రంలో 1.57 శాతమే. మరణాల రేటు జాతీయస్థాయిలో 3.19 శాతం ఉంటే.. రాష్ట్రంలో 2.46 శాతమే’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.