Homeహెల్త్‌Monkey Pox : కమ్ముకొస్తున్న మంకీపాక్స్.. దేశమంతా హైఅలెర్ట్.. గాంధీ లో ప్రత్యేక వార్డులు

Monkey Pox : కమ్ముకొస్తున్న మంకీపాక్స్.. దేశమంతా హైఅలెర్ట్.. గాంధీ లో ప్రత్యేక వార్డులు

Monkey Pox : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళన పెంచుతున్న మంకీపాక్స్‌ వ్యాప్తి మరింత వేగవంతమైంది. ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్‌ ఇప్పుడు ఆసియాలో కూడా అడుగుపెట్టింది. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంకీపాక్స్‌పై అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్, బంగ్లదేశ్‌ సరిహద్దుల్లోని ఎయిర్‌ పోర్టులు, ఇతరత్రా మార్గాల్లో ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులైన ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా హాస్పిటల్, సఫ్దర్‌ జంగ్‌ హాస్పిటల్, లేడి హార్డింగ్‌ హాస్పిటల్స్‌లో క్వారంటైన్‌కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎవరికైనా మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించినా, ఎంపాక్స్‌ సోకినట్లు కనిపించినా వారిని ఇక్కడికి తరలించి చికిత్స అందించనున్నారు. కేంద్రం చూచనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయింది. రాష్ట్రంలో మంకీపాక్స్‌ ప్రస్తుత పరిస్థితి, అప్రమత్తత ముందు జాగ్రత్త చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటివరకూ మంకీపాక్స్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. గాంధీ హాస్పిటల్, ఫీవర్‌ హాస్పిటల్స్‌ లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంకీపాక్స్‌ నివారణకు, చికిత్సకు కావాల్సిన చర్యలు చేపట్టాలని.. ఎంపాక్స్‌ పై అప్రమత్తంగా ఉండాలన్నారు.

భారత్‌లో నమోదు కాలేదు
మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం ఆదేశించంది. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయినా తక్షణం చర్యలు తీసుకుని, చికిత్స అందించాలని నోడల్‌ సెంటర్లకు సమాచారం అందించాలని సూచించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఎంపాక్స్‌ వ్యాప్తి కారణంగా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో మంకీపాక్స్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎంపాక్స్‌ కేసుల్ని నిర్ధారించేందుకు 32 ల్యాబోరేటరీలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు..
మంకీ పాక్స్‌ కేసులు నమోదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక క్వారంటైన్‌ వార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంటిపై దద్దుర్లు ఉంటే అనుమానించాలని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఎయిర్‌ పోర్టులోనే అనుమానితులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని సూచించారు. వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యాకే ఇళ్లకు పంపించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీపాక్స్‌ నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version