Mental Health: ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉంటున్నాయి. అయితే ప్రతి విమర్శకు వెంటనే స్పందించడం లేదా ప్రతి ఒక్కరినీ ఒప్పించే ప్రయత్నం చేయడం వల్ల మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ప్రతి పరిస్థితికి స్పందించడం కాదని.. అవసరమైన సందర్భంలో మాత్రమే స్పందించడం అసలైన మెచూరిటీ అని అంటున్నారు. అసలు ఈ మెచుర్యూటీ వచ్చిన వాళ్లు ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటే మానసిక సమస్యలు ఉండవు?
సమాజంలో చాలా మంది వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. అయితే ఎవరో చేసిన ప్రతి వ్యాఖ్యకు లేదా విమర్శకు సమాధానం చెప్పాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మార్చడం సాధ్యం కాదు. కొందరు ఒక విషయం ఎలా ఉన్నా.. విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి సందర్భాల్లో వాదనకు దిగడం కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. మన సమయం, శక్తిని విలువైన పనుల కోసం వినియోగించడం తెలివైన నిర్ణయం.
ప్రపంచంలో ప్రతి తప్పును మనమే సరిచేయాలని ప్రయత్నించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంపై స్పందించడం లేదా అందరినీ మార్చాలని ప్రయత్నించడం సాధ్యం కాదు. మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం, మిగతావాటిని వదిలేయడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
ఎక్కువగా వాదనలు చేసే క్రమంలో సంబంధాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మౌనం పాటించడం, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం గొప్ప విజయం. నిజమైన పరిణతి అంటే మన అహంకారాన్ని పక్కన పెట్టి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం. గెలుపు అనేది ఎప్పుడూ మాటల్లోనే కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా ఉంటుంది.
జీవితంలో విమర్శలు, అపార్థాలు, అడ్డంకులు తప్పవు. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే లక్ష్యాల నుంచి దూరమవుతాం. కొన్నిసార్లు వాటిని పట్టించుకోకుండా మన పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోవడమే ఉత్తమ నిర్ణయం. విజయం సాధించిన చాలా మంది వ్యక్తులు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించారని నిపుణులు చెబుతున్నారు.
నిజమైన మెచ్యూరిటీ అంటే కోపం వచ్చిన వెంటనే స్పందించడం కాదు. పరిస్థితిని అర్థం చేసుకుని, ఏది అవసరమో అదే చేయడం. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా వాటిలో ఉపయోగకరమైన అంశాలు ఉంటే స్వీకరించడం, అవసరం లేని వాటిని వదిలేయడం పరిపక్వతకు నిదర్శనం.
