Artificial Pregnancy: రోజు రోజుకూ శాస్త్రసాంకేతికంగా అనూహ్య మార్పులు వస్తున్నాయి. సాంకేతికంగా మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడి చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. మనిషి పుట్టుక, చావు ఈ రెండు… దేవుడి పనేనని నమ్మేవాళ్లు మనలో చాలా మంది ఉంటారు. ఒక మనిషి భూమి మీదికి రావాలంటే ఆడ, మగ కలయిక అనివార్యం అయితే టెక్నాలజీ దీనిని కూడా మార్చేసింది. శారీరకంగా కలవకపోయినా కృత్రిమ మార్గంలో గర్భం దాల్చే విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వివో ఫెర్టిలైజేషన్గా పిలిచే ఈ విధానం ద్వారా మహిళ గర్భాశయ కుహరంలోకి వీర్యాన్ని పంపించడం ద్వారా గర్భం దాల్చేలా చేయొచ్చు. ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనిని నిపుణులైన వైద్యులు మాత్రమే చేస్తారు. అందులోనూ ఖర్చుతో కూడుకున్నది. ఓ మహిళ మాత్రం ఎవరి సహాయం లేకుండానే కేవలం రూ. 4 వేల ఖర్చుతోనే కృత్రిమంగా గర్భదారణ దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తక్కువ ఖర్చుతో…
అమెరికాకు చెందిన 24 ఏళ్ల బెయిలీ ఎన్నిస్ అనే మహిళ తల్లి కావాలని ఎన్నో రోజులుగా ఆరాటపడుతోంది. అయితే మగతోడు అవసరం లేదనే మనస్తత్వంతో ఉన్న బెయిలీ పిల్లలని మాత్రం కోరుకుంటోంది. ఇందు కోసం వైద్యుల సహకారం లేకుండా డీఐవై కిట్తో ఇంట్లోనే కృత్రిమ గర్భదారణ పొందింది. అంతేకాదు జూలైలో 2.32 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఈ ప్రక్రియకు మన కరెన్సీలో రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. కానీ సదరు మహిళ కేవలం రూ.4 వేలతో ముగించేసింది. అయితే ఈ విధానంలో తొలిసారే విజయవంతం కావడం విశేషం. సాధారణంగా ఈ పద్ధతిలో 5 నుంచి 30 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దాత నుంచి స్పెర్మ్..
మగతోడు వద్దు కానీ పిల్లలు కావాలి బాగానే ఉంది.. మరి వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది. ఇందుకోసం బెయిలీ ఓ ఆలోచన చేసింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఓ స్పెర్మ్ దాతను సెలక్ట్ చేసుకుంది. తొలుత అతనితో వాట్సాప్లో చాట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకుంది. అనంతరం డోనర్ ఇచ్చిన శుక్రకణాలను కిట్ సహాయంతో గర్భాశయంలోకి పంపించుకుంది. ఈ ప్రక్రియ మొత్తంలో స్టెరైల్ కప్స్, సిరంజిలు, ఓవిలేషన్ టెస్ట్లు మాత్రమే ఉపయోగించినట్లు ఆమె తెలిపింది.
సొంత ప్రయోగం ప్రమాదకరం..
ఎక్కడో అమెరికాకు చెందిన మహిళ సొంతంగా ఈ విధానంలో సక్సెస్ అయ్యింది కదా అని ఎవరు పడితే వారు ప్రయత్నించడం ప్రమాదకరం. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పటికీ మంచివి కావు. గర్భదారణ విషయంలో వైద్యుల సలహాలు తీసుకొని, వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవడమే అన్నింటా క్షేమం.