టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన విజయ్ దేవరకొండ–రష్మిక జంట వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. “విరోష్” (Virosh) జంటగా అభిమానులు పిలుచుకునే ఈ జంట ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. చేతిలో చెయ్యి వేసుకుని నవ్వుతూ ఎంట్రీ ఇచ్చిన విజయ్, రష్మిక అతిథులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్లో పాల్గొనడంతో వేడుక మరింత ఉత్సాహంగా మారింది.
ప్రత్యేకంగా అలంకరించిన స్టార్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.
సెలెబ్రిటీల సందడి
రిసెప్షన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సతీమణి గీతతో పాటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దంపతులు హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కూడా కొత్త జంటను అభినందించారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అక్కినేని నాగార్జున దంపతులు, నాగచైతన్య, రామ్చరణ్–ఉపాసన దంపతులు, నాని కుటుంబం, నవీన్ పొలిశెట్టి, దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ, నిర్మాత దిల్రాజు కుటుంబం, నమ్రతా శిరోద్కర్, రాధిక–శరత్కుమార్ దంపతులు హాజరై వేడుకను మరింత గ్రాండ్గా మార్చారు.
ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ–రష్మిక వివాహం సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్తో ఈ జంట మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారి “విరోష్” జంటపై అభిమానుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


