సినిమాలో విషయం ఉండాలే గానీ.. స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తారనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. గత శుక్రవారం విడుదలైన ‘SR కల్యాణ మండపం’ చిత్రం సాధిస్తున్న వసూళ్లే ఇందుకు నిదర్శనం. ఆగస్టు 6న మొత్తం ఏడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో.. ముగ్గురు మొనగాళ్లు, మ్యాడ్, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం, రావణలంక, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, SR కల్యాణ మండపం చిత్రాలున్నాయి. ఇందులో మొదటి నుంచీ జనాల్లో చర్చలో ఉన్న చిత్రం SR కల్యాణ మండపం మాత్రమే. పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్ తోనూ హైప్ క్రియేట్ చేసింది.
రిలీజ్ అయిన తర్వాత సినిమాలోనూ విషయం ఉందని తేలడంతో.. కల్యాణ మండపంలోకి వచ్చేందుకే ఆడియన్స్ ఆసక్తి చూపించారు. సినిమా బాగుందనే టాక్ రావడంతో.. జనాలు క్యూ కట్టారు. తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ ఫుల్లుగా వర్కువట్ కావడంతో.. థియేటర్లు కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ గలగలలాడుతోంది.
ఆ విధంగా తొలి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 4.5 కోట్ల మేర సాగింది. ఇదే టార్గెట్ తో రెండు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో అమెరికాలో 30 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే.. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు కూడా కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. 1.25 కోట్ల షేర్ దక్కినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విధంగా.. రెండు రోజుల్లోనే 2.66 కోట్ల షేర్ సాధించింది.
ఇక, మూడో రోజు కూడా వసూళ్ల హవా కొనసాగించింది. మూడోరోజు సండే కావడం.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ప్లస్ అయ్యింది. దీంతో.. మూడో రోజు మొత్తం 1.40 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా.. ఇప్పటి వరకు విడుదలైన మూడు రోజుల్లో కలిపి ఈ చిత్రం 4.36 కోట్ల షేర్ సాధించింది. 7.28 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.55 కోట్లు. అంటే.. మరో 44 లక్షలు సాధిస్తే.. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా లాభాల్లోనే పడిపోతుంది.
అయితే.. ఏపీలో థియేటర్లకు అనుకూల పరిస్థితులు లేకపోయినా.. ఇంత మొత్తం సాధించడం విశేషం. అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీతోపాటు నైట్ షోలు రద్దయ్యాయి. ఒకవేళ అక్కడ కూడా తెలంగాణ మాదిరిగానే పరిస్థితులు ఉంటే.. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో దాటిపోయేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత మంచి సక్సెస్ అందుకున్న చిత్రంగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ నిలిచిందని చెప్పొచ్చు.