అయితే మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు. ఎలాగూ హేమను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. అలాగే ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ ఆయన్ని కొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాల నాయకుడు వర్మ ఈ వ్యవహారం పై తనదైన శైలిలో ట్వీట్లతో విరుచుకుపడ్డాడు.
ఆర్జీవీ ట్వీట్లలో మ్యాటర్ విషయానికి వస్తే.. ‘ప్రకాశ్ రాజ్ కన్నడిగుడు కావొచ్చు. కానీ ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు కూడా నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్ రాజ్ నాన్ లోకలా’ ? అంటూ వర్మ ఆవేశంగా ప్రశ్నించాడు.
అలాగే మరో ట్వీట్ లో ‘కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాశ్రాజ్ నాన్ లోకల్ అయితే, మరి మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్, అదే విధంగా ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ లోకలా ?’ అని కాస్త గట్టిగానే అడుగుతున్నాడు ఆర్జీవీ. పనిలో పనిగా మరో వివాదస్పద ట్వీట్ చేస్తూ ‘మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకల్’ అంటూ చెప్పుకొచ్చాడు.