Ram Gopal Varma
Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా బాలీవుడ్ ఆధిపత్యం కొనసాగింది. కానీ రీసెంట్ ఇయర్స్ లో టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ సినిమాల కంటే కూడా భారీ విజయాలు నమోదు చేస్తుండడంతో అక్కడి వారు తెలుగు చిత్ర పరిశ్రమ మీద కాస్త అసహనంగా ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే చిత్ర పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశం మీద ఎన్నో సార్లు మాట్లాడిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులను గురించి మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ‘పుష్ప 2’ వంటి సినిమాలను రూపొందించడానికి సామర్థ్యం ఉన్నా, వాటిని బాలీవుడ్ ఫిల్మ్మేకర్స్ రూపొందించలేకపోతున్నారని అన్నారు. “బాలీవుడ్లో సినిమాలు తయారుచేయడంలో క్రియేటివిటీని మాత్రమే చూస్తారు. దక్షిణాది పరిశ్రమలో అయితే మాస్ ఎంటర్టైనర్లతో కూడిన సినిమాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ తన మేకింగ్ స్టైల్ను మార్చుకుంటోంది” అని వర్మ అన్నారు.
‘‘పుష్ప 2’ వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్మేకర్స్కు ఆ సామర్థ్యం లేక కాదు. కానీ, వారు ఆవిధంగా ఏమాత్రం ఆలోచన లేదు. సౌత్, నార్త్.. ప్రేక్షకులు ఎక్కడైనా ఒక్కటే. సినిమాలే వారి మధ్య వ్యత్యాసం పెంచుతున్నాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తోన్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసే వాళ్లు. సౌత్లో ఉన్న ఆనాటి అగ్రహీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వాళ్లే. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వాళ్లు నేర్చుకున్నారు. కొన్నాళ్లకు మ్యూజిక్ కంపెనీలు వెలిశాయి. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాయి. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలను తీసుకువచ్చాయి. అదే సమయంలో అమితాబ్ సుమారు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీల వైపు మొగ్గింది. ‘మైనే ప్యార్ కియా’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి సినిమాలు తెర మీదకు వచ్చాయి. ఇటీవల కొత్తతరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ.. విదేశీ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేతరహా చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆవిధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మారిపోయింది.. మాస్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడం మానేసింది. కానీ, సౌత్ పరిశ్రమలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి వారు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. మాస్ ఆడియన్స్కు దగ్గరవుతున్నారు’’ అని వర్మ చెప్పారు.
ప్రస్తుతం ఆర్జీవీ శారీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆరాధ్య దేవి హీరోయిన్ గా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా.. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు.