Raghavendra Rao- NTR
Raghavendra Rao- NTR: ఎన్టీ రామారావు, దర్శకుడు రాఘవేంద్రరావుది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికతో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు విజయవంతమైనవే. అడవిరాముడు చిత్రంతో ప్రారంభమైన వీరి కలయిక మేజర్ చంద్రకాంత్ వరకూ కొనసాగింది. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 12 చిత్రాలు తెరకెక్కాయి. అందులో పది చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. రెండు చిత్రాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 85 శాతం విజయాలున్నాయి. మొత్తంగా టాలీవుడ్లోనే ఈ ఇద్దరిది సూపర్ కాంబినేషన్. ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో అలా చూపించగలడంలో రాఘవేంద్రరావు దిట్ట.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం అడవిరాముడు ఎన్నో సంచలనకు వేదికగా నిలిచింది. అటు రాఘవేంద్రరావుకు, ఇటు హీరోయిన్లు జయప్రద, జయసుధల కెరీర్ కు టర్నింగ్ పాయింటిచ్చింది. తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసింది. 1977 ఏప్రిల్ 28న రిలీజ్ అయినా ఈ సినిమా అత్యధికంగా రూ.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ తో చేసిన తొలి ప్రయోగంతోనే సక్సెస్ దక్కడంతో రాఘవేంద్రరావు వెనుదిరిగి చూడలేదు. టాలివుడ్ లో టాప్ దర్శకుడిగా తనను నిలపడంలో ఎన్టీఆర్ పాత్ర మరువలేనిదని ఇప్పటికీ రాఘవేంద్రరావు సగర్వంగా చెబుతుంటారు.
అయితే ఓ సందర్భంలో రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. అడవిరాముడు తొలి చిత్రం కావడంతో రాఘవేంద్రరావు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పటికే ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీనే ఏలుతున్నారు. అడవిరాముడు సినిమా షూటింగ్ లో భాగంగా ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న పాటను చిత్రీకరిస్తున్నారు. బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఏకలవ్యుడు, వాల్మీకి, శ్రీరాముడు పాత్రల్లో కనిపిస్తారు. శ్రీరాముడు శబరి దగ్గరకు వచ్చినప్పుడు శబరి తలపైకెత్తి చూడలేదు. ఆమెకు రాముడి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సన్నివేశాన్ని చేసి చూపిస్తానని దర్శకుడు రాఘవేంద్రరావు ముందుకొచ్చారు. ఎన్టీఆర్ పాదాలను తాకారు. ఆయన ఆహార్యాన్ని చూసి ఓ కన్నీటిబొట్టును ఆయన పాదాలపై రాల్చారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా రూపొందించిన సావనీర్ లో రాఘవేంద్రరావు ఈ విషయాన్ని వెల్లడించారు.